AP High Court: ఏపిలో గ్రూపు – 1 ప్రధాన పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న అభియోగంతో హైకోర్టులో దాఖలైన పిటిషన్ లపై హైకోర్టులో విచారణ జరిగింది. దీనికి సంబంధించి 8 పిటిషన్ లు దాఖలు కాగా విచారణ సందర్భంలో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వులో ఉంచింది. గ్రూపు 1 ప్రధాన పరీక్షలను నిబంధనల ప్రకారం నిర్వహించలేదని పిటిషనర్ ల తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. డిజిటల్ వాల్యూషన్ గురించి చివరి దశలో తెలిపారని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తెలుగు మీడియం పేపర్ లను రాష్ట్రంలో, ఇంగ్లీషు మీడియం పేపర్లు ఇతర రాష్ట్రాల్లో వాల్యూషన్ చేశారనీ, దీంతో ఇంగ్లీషు మీడియంలో రాసిన విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని పిటిషనర్ ల తరపు న్యాయవాది పేర్కొన్నారు.
ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులతో వాల్యూషన్ ఎలా చేయిస్తుందని ప్రశ్నిస్తూ..ఏపీపీఎస్సీ చైర్మన్ ను పక్కన పెట్టి కార్యదర్శి ఏకపక్షంగా వ్యవహరించారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇంటర్వ్యూల నిలుపుదలకు మద్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
ప్రభుత్వ తరపు న్యాయవాది తన వాదనలో వ్యాల్యూషన్ గురించి ముందుగా చెప్పాల్సిన అవసరం లేదనీ, నిబంధనల ప్రకారమే పరీక్షలు నిర్వహించామని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది. దీంతో త్వరలో జరగనున్న గ్రూప్ 1 ఇంటర్వ్యలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.