ఏపి ప్రభుత్వానికి హైకోర్టులో మరో భంగపాటు ఎదురయ్యింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై స్టే ఇవ్వాలని కోరుతూ ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై గురువారం ధర్మాసనం విచారణ జరిపింది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నదని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కరోనా కారణంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. అయితే ధర్మాసనం ప్రభుత్వ విజ్ఞప్తిని తిరస్కరించింది. స్టే ఇవ్వడానికి నిరాకరించింది. పిటిషన్పై విచారణను రేపటికి వాయిదా వేసింది.
రాష్ట్రంలో ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న పట్టుదలతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా లేదని రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియజేసినా ఎన్నికల సంఘం మాత్రం ఇతర రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ నెల 1వ తేదీన పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.