అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుపై హైకోర్టు స్టే విధించింది. ఈ స్టే ఆగష్టు 14 వరకూ వర్తిస్తుందని ధర్మాసనం తెలిపింది. దీంతో హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలినట్లైంది. అధికార వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో వైజాగ్ నుండి పరిపాలన సాగించడానికి జగన్ సర్కారు ఏర్పాట్లు చేస్తోంది.
దీనిపై రాజధాని కోసం భూములిచ్చిన అమరావతి రైతుల్లో ఆగ్రహం పెల్లుబికింది. న్యాయపోరాటం చేయాలనుకున్న వారు పిటీషన్లు దాఖలు చేసారు. పిటిషన్ల తరపున శ్యామ్ దివాన్, ఉన్నవ మురళీధర్ బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని తమ వాదనలు వినిపించారు. ఆగష్టు 14 వరకూ స్టే విధించిన కోర్టు, రిప్లై కౌంటర్ వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇక తదుపరి విచారణను ఆగష్టు 14కు వాయిదా వేస్తూ తన నిర్ణయాన్ని తెలియజేసింది.