AP High Court : ఏపి పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీడియో తీయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. పంచాయతీ ఎన్నికలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను సీసీ కెమెరలో రికార్డు చేయాలని, లేదా వీడియో తీయాలని ఎస్ఈసీ ఈ నెల 13న జారీ చేసింది.
ఈ ఆదేశాలు అమలు కాకపోవడంతో ఆ ఆదేశాలు అమలు జరిగేలా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించాలని కోరుతూ కృష్ణా జిల్లాకు చెందిన శ్రీపతి నాంచారయ్య, గుంటూరుకు చెందిన ఎం ప్రతాప్ నాయక్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీడియో తీయాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసినా అమలు కావడం లేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ నెల 17,21 తేదీలలో జరుగనున్న మూడు, నాలుగు విడతల గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపును రికార్డు చేసేలా అదేశాలు జారీ చేయాలని కోరారు.
కాగా ఎస్ఈసీ తరుపు న్యాయవాది అశ్వనీకుమార్ దీనిపై వివరణ ఇస్తూ ఎస్ఈసీ ఈ నెల 13న ఇచ్చిన ఉత్తర్వులను సవరించడం జరిగిందనీ, వీడియో గ్రఫీపై 15వ తేదీన వేరే ఆదేశాలు జారీ చేయడం జరిగిందని చెప్పారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రమే కెమెరాలు ఏర్పాటుకు ఎస్ఈసీ ఆదేశాలు ఇచ్చిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక పరంగా ఇబ్బందులు ఉన్న కారణంగా పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు సాధ్యంకాదని అన్నారు. పిటిషనర్ లది కేవలం ఆందోళన మాత్రమేనని ప్రభుత్వ తరపు న్యాయవాది అన్నారు. ఇరువురి వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం తీర్పు ఇచ్చింది. వీడియో గ్రఫీ విషయంలో ఎస్ఈసీ ఆదేశాలను పాటించాలని పేర్కొన్నది. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎస్ఈసీదేనని అంటూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీడియో తీయాలని ఏదైనా పంచాయతీలో ఒక్క ఓటరు కోరినా సంబంధిత పంచాయతీలో వీడియో తీయాలని తెలిపింది. సాంకేతిక కారణాలను సాకుగా చెప్పవద్దని హైకోర్టు స్పష్టం చేసింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?