AP High Court : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలపై మంత్రి కొడాలి నాని దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. సోమవారం ఇరువర్గాల వాదనలతో సంతృప్తి చెందని ధర్మాసనం..
వాస్తవాలను కోర్టు ముందు ఉంచడంలో ఇరువర్గాలు విఫలమైనట్లుగా పేర్కొంది.. సీనియర్ న్యాయవాదిని అమికస్ క్యూరీగా నియమిస్తామని హైకోర్టు చెప్పింది. అనంతరం బుధవారానికి విచారణను వాయిదా వేసింది.
AP High Court : అసలు జరిగిందేమిటంటే ?
ఇటీవల ఒక మీడియా సమావేశంలో కొడాలి నాని ఎస్ఈసీ, కమిషనర్ నిమ్మగడ్డను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ కామెంట్లు అభ్యంతరకరంగా, ఎస్ఈసీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయని మంత్రి కొడాలికి కమిషనర్ షోకాజ్ నోటీస్ ఇచ్చారు.
అదే రోజు సాయంత్రంలోపు వివరణ ఇవ్వాలన్నారు. కానీ మంత్రి ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో ఈనెల 21 వరకు మీడియాతో మాట్లాడొద్దని.. అప్పటి వరకు మంత్రి సమావేశాల్లో, బృందాలతో మాట్లాడొద్దని ఆంక్షలు విధించారు. ఆ ఉత్తర్వులపై మంత్రి హైకోర్టులో అత్యవసరంగా హౌజ్మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.దీనిపై సోమవారం విచారణ జరిగింది.
ఆ వీడియోనే కీలకం!
ప్రెస్మీట్లో మంత్రి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో కీలకంగా మారింది. మంత్రి చేసిన వ్యాఖ్యల సంబంధించిన వీడియో ఫుటేజీని పరిశీలించాలని ఎస్ఈసీ తరపు న్యాయవాది అశ్వనీకుమార్ హైకోర్టును కోరారు. మంత్రి మీడియాతో మాట్లాడకుండా మంత్రిని నిలువరించడానికి ఉత్తర్వులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో ఫుటేజీని పరిశీలిస్తే స్పష్టమవుతుందన్నారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలతో మంత్రి నాని చేసిన వ్యాఖ్యలను పోల్చిచూడలేమన్నారు. లాయర్ చెప్పిన వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు జడ్జి వీడియో ఫుటేజీ సహా ఆ వ్యాఖ్యలకు సంబంధించిన రాతప్రతిని కోర్టుకు సమర్పించాలని ఎస్ఈసీని ఆదేశించారు.
కేసును లోతుగా విచారించాల్సి ఉందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.సోమవారం ఇరువర్గాల వాదనలతో సంతృప్తి చెందని ధర్మాసనం వాస్తవాలను కోర్టు ముందు ఉంచడంలో ఇరువర్గాలు విఫలమయ్యాయని అన్నారు న్యాయసూత్రాలను, రాజ్యాంగ న్యాయసూత్రాలను విశదీకరించడంలో ఇరువర్గాలు విఫలం అయ్యాయని పేర్కొన్న హైకోర్టు ధర్మాసనం అన్ని సాక్ష్యాలను వీడియోను పరిశీలించకుండా ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేమన్నారు. ఈ వ్యవహారంపై బుధవారం నాటికి విచారణ వాయిదా పడింది.