అమరావతి : విశాఖపట్నం మెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై ఏపి హైకోర్టు నేడు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ సుధాకర్ విషయంలో విశాఖ పోలీసులు వ్యవహరించిన తీరుపై వీడియోలతో టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత హైకోర్టుకు లేఖ రాయడంతో సుమోటో పిల్గా స్వీకరించి విచారణ జరిపింది. ఆసుపత్రికి వెళ్లి సుధాకర్ వాగ్మూలాన్ని రికార్డు చేయాలని విశాఖ సెషన్స్ జడ్జిని హైకోర్టు ఆదేశించింది. రేపు సాయంత్రంలోగా వాగ్మూలాన్ని హైకోర్టులో సమార్పించాలని ధర్మాసనం ఆదేశించింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్తో పాటు వీడియో క్లిపింగ్స్ను కూడా పిటిషనర్ తరుపు న్యాయవాదికి ఇవ్వాలని కూడా కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారానికి కోర్టు వాయిదా వేసింది.
కరోనా నేపథ్యంలో ఆసుపత్రులకు అవసరమైన మాస్క్ లు, ఇతర సామాగ్రి అందించడం లేదంటూ నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించే అనస్థీషియా డాక్టర్ సుధాకర్ ప్రభుత్వానికి వ్యతిరకంగా మాట్లాడిన నేపధ్యంలో ఉన్నతాధికారులు ఆయన్ను సస్పెండ్ చేశారు. అయితే సస్పెండ్ అయిన సదరు డాక్టర్ ఇటీవల విశాఖ విధుల్లో మద్యం సేవించి ప్రభుత్వాన్ని, ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్ది ని దుర్భాషలాడుతూ హల్ చల్ చేశాడు. దీనిపై పోలీసులు ఆయనపై పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. ఆయన మానసిక ప్రవర్తన సరిగా లేదని భావించిన పోలీసు లు డాక్టర్ సుధాకర్ ను విశాఖ మెంటల్ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే.
కాగా డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై హైకోర్టులో మరో పిటిషన్ కూడా దాఖలైంది. విశాఖ పోలీసులు డాక్టర్ పట్ల అమానుషంగా ప్రవర్తించారనీ, ఈ ఘటనపై ఉన్నత స్థాయి జ్యుడీషియల్ కమిటీతో విచారణ జరిపించాలని కోరారు. ఈ ఘటనకు బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకునేలా ఆదేశించాలని రిటైర్డ్ రైల్వే ఉద్యోగి హైకోర్టులో పిల్ వేశారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, విశాఖ సీపీని ప్రతివాదులుగా ప్రస్తావించారు. ఈ పిటిషన్లపై కోర్టు విచారణ జరిపింది.