అమరావతి : ఏపిలో ప్రభుత్వ భూముల అమ్మకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన ప్రభుత్వ భూముల అమ్మకం వ్యవహారం హైకోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ భూముల అమ్మకాలను సవాల్ చేస్తూ గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర్త తోట సురేశ్ బాబుతో పాటు మరో ముగ్గురు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. అందులో భాగంగానే ప్రభుత్వ భూముల అమ్మకాలపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది నర్రా శ్రీనివాస్ మరి కొందరు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ముందుగా భూముల వేలం ప్రక్రియను జూన్ 11, 12, 13 తేదీలకు వాయిదా వేసినట్టు ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. కేసు విచారణ దశలో ఉన్నందున కోర్టు అనుమతి లేకుండా ఈ – టెండర్లను ఖరారు చేయవద్దని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వేసవి సెలవుల అనంతరం జూన్ 18 కి హైకోర్టు వాయిదా వేసింది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో భూముల వేలం ప్రక్రియను అమ్మకాన్ని ప్రభుత్వం నెగ్గించుకుంటుదా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.