(అమరావతి నుండి“న్యూస్ ఆర్బిట్”బ్యూరో)
ఏపి పరిపాలనా రాజధాని తరలింపునకు చేసిన చట్టంపై విధించిన స్టేటస్ కోను హైకోర్టు అక్టోబర్ అయిదవ తేదీ వరకూ పొడిగించింది. ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన దాఖలైన 93 పిటిషన్లపై నేడు హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. తదుపరి విచారణను అక్టోబర్ అయిదవ తేదీకి వాయిదా వేసిన ధర్మాసనం ప్రస్తుతం రాజధానిపై ఉన్న స్టేటస్ ను అక్టోబర్ అయిదవ తేదీ వరకూ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
అమరావతి రైతులు, రైతు పరిరక్షణ సమితి, మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో నేటి నుండి రోజు వారి విచారణ జరగాల్సి ఉండగా హైకోర్టు విచారణను అక్టోబర్ 5వ తేదీకి వాయిదా వేస్తూ ఆ రోజు నుండి రోజు వారి విచారణ చేపడతామని వెల్లడించింది. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, సిఆర్డీఏ రద్దు బిల్లు, జీఎన్ రావు కమిటీ, హైపవర్ కమిటీల చట్టబద్దత తదితర అంశాలపై రాజధాని అమరావతి ప్రాంత రైతులు కేసులు వేశారు.