ఏపి ప్రభుత్వంపై హైకోర్టు మరో సారి కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు గానూ ప్రభుత్వ భూములు విక్రయించడానికి మిషన్ బిల్డ్ ఏపిని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలసిందే. అయితే మిషన్ బిల్డ్ ఏపి పేరుతో ప్రభుత్వ ఆస్తుల అమ్మకాన్ని నిలిపివేయించాలని హైకోర్టులో పది పిటిషన్లు దాఖలు అయ్యాయి.
ఈ పిటిషన్లపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంలో హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ ఉందా ? ఆస్తులను విక్రయించి నిధులను సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందా? అని న్యాయస్థానం ప్రశ్నించింది. కరోనా సమయంలో ప్రభుత్వం పెంచిన అధిక ధరలకు మద్యం కొనుగోలు చేసి రాష్ట్ర సంక్షేమానికి పాటుపడిన మందుబాబులకు కృతజ్ఞతలు చెప్పాల్సిందేనంటూ వ్యంగ్యంగా హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఈ సందర్భంలో ప్రభుత్వ న్యాయవాది మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఏపి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని వివరించే ప్రయత్నం చేయగా ఎంత బాగా చేస్తున్నారో అందరికీ తెలుసునని హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వం దీనిపై కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది.