మూడు రాజధానుల విషయంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికే కాకుండా ప్రతిపక్షాలు అన్నింటికి కూడా హైకోర్టు నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది.
సాధారణంగా ఇలాంటి కేసుల్లో ప్రభుత్వానికి నోటీసులు ఇస్తారు. ప్రభుత్వమే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.కానీ అత్యంత అరుదుగా కోర్టుల్లో జరిగే ప్రక్రియ రాష్ట్రంలో చోటు చేసుకుంది.ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్.రాజధాని అమరావతి నుండి తరలించడాన్ని నిరసిస్తూ రాజధాని పరిరక్షణ సమితి న్యాయ పోరాటం సాగిస్తున్న విషయం తెలిసిందే .ఒకవైపు అమరావతిలో రెండు వందల యాభై రోజులుగా ఆందోళనలు జరుగుతూనే ఉండగా మరోవైపు కోర్టుల్లో కూడా రాజధాని తరలింపును నిరసిస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి.
అమరావతి ప్రాంతంలో ఉన్న నాయకుల్లో చాలా మందికి న్యాయ వ్యవహారాలపై అవగాహన ఉండటంతో వారు కోర్టుల్లో ఈ విషయమై పోరాడుతున్నారు.ఈ నేపథ్యంలో వారు హైకోర్టులో వేసిన పిటిషన్లో రాజధానిగా అమరావతిని ప్రకటించినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసిపి, అధికారం లో ఉన్న టిడిపి ,దాని మిత్రపక్షమైన బిజెపి లు ఎలాంటి ప్రకటనలు చేసాయో ఉదహరించాయి. ఇప్పుడు ఈ పార్టీల స్వరం మారిందని పిటిషనర్లు కోర్టు దృష్టికి తెచ్చారు.గురువారం ఈ పిటిషన్పై విచారణ జరిగినపుడు ఈ అంశాలు అన్నింటినీ న్యాయమూర్తులు పరిగణనలోకి తీసుకున్నారు.వైసిపి, బిజెపి ,కాంగ్రెస్, టిడిపి, సిపిఎం ,సిపిఐ ,జనసేన ఇలా రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలకు హైకోర్టు పోటీసులు జారీ చేసి అమరావతిపై ఆయా పార్టీల తాజా వైఖరిని స్పష్టం చేస్తూ అఫిడవిటు దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది.
ఇది చాలా అరుదైన సంఘటన అని న్యాయనిపుణులు చెప్తున్నారు. హైకోర్టు ఆదేశాలు వివిధ రాజకీయ పార్టీల గొంతులలో వెలక్కాయలు పడేశాయి.రాజధానిగా అమరావతి పై ఆయా రాజకీయ పార్టీలు తప్పనిసరిగా తమ అభిప్రాయాలను కోర్టుకు నివేదించాల్సి ఉంటుంది.ఇందులో కాస్త అటూ ఇటూ అయితే కోర్టు ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుంది . ఏదో పత్రికా ప్రకటన అయితే ఇచ్చేసి అవసరమైతే సవరించుకు౦టారు.కోర్టుల్లో ఆ పప్పులు ఉడకవు కదా ! పైగా కోర్టుకు ఏదయితే నివేదించారో దానినే ప్రజలకి కూడా చెప్పాల్సివుంటుంది అందువల్ల ఇక రాజధానిపై ఎవరూ దాగుడుమూతలు ఆడడానికి వీలుండదు.మొత్తం మీద ఏపీలోని రాజకీయ పార్టీలన్నిటికీ కష్టకాలం వచ్చింది !