(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
ఏపి ప్రభుత్వానికి హైకోర్టు మరో ఝలక్ ఇచ్చింది. ఎన్నికల సంఘం ఉద్యోగులపై సిఐడి నమోదు చేసిన కేసులపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఎన్నికల సంఘం కార్యదర్శి సాంబమూర్తి, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్లు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లను ఒకే సారి విచారిస్తామని కోర్టు తెలిపింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తనకు భద్రత కల్పించాలని కోరుతూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్రానికి లేఖ రాసిన విషయంపై పెద్ద దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. ఆ వ్యవహారంలో లేఖ విషయాన్ని తేల్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సిఐడి దర్యాప్తునకు ఆదేశించింది. సిఐడి అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఎన్నికల సంఘం కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి కంప్యూటర్ హార్డ్ డిస్క్, ఇతర రికార్డులను సీజ్ చేశారు.
సోమవారం హైకోర్టులో విచారణ సందర్భంగా ధర్మాసనం..ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసే వరకూ తదుపరి చర్యలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే సోమవారంకు వాయిదా వేసింది హైకోర్టు.