(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
ప్రస్తుత కరోనా నేపథ్యంలో ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియను ఆన్లైన్ ద్వారా నిర్వహించాలని ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఉత్తర్వులను ఏపి హైకోర్టు పది రోజుల పాటు సస్పెండ్ చేసింది.
విద్యార్థుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వమే విద్యార్థులకు కళాశాలల్లో సీట్లు కేటాయించడంపై కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సోమవారం హైకోర్టు ధర్మాసనం విచారించింది. విద్యార్థులు ఏ కళాశాలలో చేరాలనేది వారి ఇష్టానికే వదిలివేయాలని పిటిషనర్లు కోరారు. అడ్మిషన్ల సమయంలో విద్యార్థికి కౌన్సిలింగ్ ఇచ్చి ఏ గ్రూపులో ఆసక్తి ఉందో తెలుసుకుని సీట్లు కేటాయిస్తారనీ, ఆన్ లైన్ అడ్మిషన్ ప్రక్రియ వల్ల విద్యార్థి సరైన గ్రూపును ఎంచుకోలేడనే అభిప్రాయాన్ని న్యాయవాది..ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వమే కళాశాలలను ఎలా కేటాయిస్తుందని పిటిషనర్ల తరపున న్యాయవాది వాదించారు.
ఈ అంశంపై ఏ నిబంధనల ప్రకారం ముందుకు వెళుతున్నారని విద్యాశాఖను హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై పూర్తి సమాచారం అందించేందుకు సమయం కావాలని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టును కోరారు. దీంతో హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేస్తూ అప్పటి వరకూ ఆన్ లైన్ అడ్మిషన్ల జివో అమలుపై స్టే విధించింది. ఈ లోపుగా ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.