(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రాజధాని మార్పునకు సంబంధించిన కేసులపై విచారణను చేపట్టింది. రేపటి నుండి రోజు వారి విచారణ చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకె మల్లేశ్వరి, జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం నిర్ణయించింది. మూడు రాజధానుల అంశానికి సంబంధించి 229 అనుబంధ పిటిషన్లు ఉన్నట్లు పేర్కొన్నది. పిటిషన్లను అంశాల వారిగా విభజించి విచారణ జరుపనున్నట్లు తెలిపింది. మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించిన పిటిషన్లపై ధర్మాసనం విచారణ చేస్తుందని న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం ఆన్ లైన్ విధానంలో విచారణ జరుగుతోంది. అయితే ప్రధాన పిటిషన్లపై హైకోర్టు భౌతిక వాదనలకే ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు చేసిన వారిలో అమరావతి గ్రామాల రైతులు, సామాజిక కార్యకర్తలు, విపక్ష పార్టీలు, అమరావతి ఉద్యమకారులు ఉన్నారు. వీరితో పాటు వివిధ పార్టీలు కూడా తమ అభిప్రాయాలతో అఫిడవిట్లు దాఖలు చేశాయి.
మూడు రాజధానుల ఏర్పాటునకు ప్రభుత్వం ఆమోదించిన సీఆర్డిఏ రద్దు, పరిపాలనా వికేంద్రకరణ బిల్లులను గవర్నర్ ఆమోదించగా ఆ బిల్లులు రాజ్యాంగబద్దంగా రూపుదిద్దుకోలేదని పిటిషన్లు దాఖలు కావడంతో హైకోర్టు సదరు బిల్లులప స్టేటస్ కో ఇచ్చిన విషయం తెలిసిందే.