AP IAS Transfers: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఐఏఎస్ అధికారుల బదిలీకి సంబంధించి ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీ జరుగుతోంది. ఈ క్రమంలోనే మరో కొందరు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. భూ పరిపాలనా శాఖ చీఫ్ కమిషనర్ కార్యాలయ కార్యదర్శిగా బాబు ఏను బదిలీ చేసిన ప్రభుత్వం.. డెయిరీ డెవలప్ మెంట్ ఎండిగా ఆయనకే పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.
సీసీఎల్ఏ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న బీహెచ్ఎన్ చక్రవర్తిని సాధారణ పరిపాలనా శాఖ (జీఏడి) లో రిపోర్టు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. నెల్లూరు జిల్లా గ్రామ వార్డు సచివాలయాల జేసీగా పని చేస్తున్న జి గణేశ్ కుమార్ ను సీసీఎల్ఏ లో జాయింట్ సెక్రటరీగా బదిలీ చేసిన ప్రభుత్వం.. ఏలూరు ఆర్డీఓ పి రచనను సీసీఎల్ఏ లోని సీఎంఆర్ఓ ప్రాజెక్టు డైరెక్టర్ గా బదిలీ చేసింది. ఎన్ తేజ్ భరత్ ను సీసీఎల్ఏ కార్యాలయంలో విజిలెన్స్ జాయింట్ సెక్రటరీ గా ప్రభుత్వం నియమించింది.