భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇవేళ ఏపి జ్యూడీషియల్ అకాడమీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంగళగిరి మండలం ఖాజా లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. అనంతరం సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పెండింగ్ కేసులు సత్వరమే పరిష్కరించాలని అన్నారు. న్యాయమూర్తులకు సొంత సామర్ద్యాలపై విశ్వాసం ఉండాలన్నారు. ముఖ్యమైన కేసుల్లో త్వరగా న్యాయం జరిగేలా చూడాలని సూచించారు.

న్యాయవ్యవస్థలో కేసుల సంఖ్య కంటే తీర్పుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని సీజేఐ పేర్కొన్నారు. న్యాయవ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం వాడకం పెరిగిందన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకునేలా డిజిటలైజేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టామనీ, సాంకేతికతకు అనుగుణంగా మార్పులు చేసుకోవాలని తెలిపారు. కేసుల సత్వర పరిష్కారానికి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుందని అన్నారు. న్యాయమూర్తులు నిత్య విద్యార్ధులుగా ఉంటూ నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కోర్టులు వివాదాల పరిష్కారమే కాకుండా న్యాయాన్ని నిలబెట్టేలా చూడాలన్నారు. కేసుల పరిష్కారంలో జాప్యానని తగ్గించాలని అన్నారు. న్యాయ వ్యవస్థ ను పరిరక్షించడానికి అందరి సహకారం అవసరం అని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు.