అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నామినేటెడ్ పోస్టులను దశలవారీగా భర్తీ చేస్తున్నారు. మంత్రివర్గంలో అవకాశం కల్పించలేకపోయిన నేతలకు నామినేటెడ్ పదవులను కట్టబెడుతున్నారు. అందులో భాగంగా ఇటీవల ఎపిఐఐసి చైర్మన్ పదవిని నగరి ఎమ్మెల్యే ఆర్కె రోజాకు కట్టబెట్టిన విషయం తెలిసిందే. తాజాగా అసెంబ్లీ కమిటీలకు ఛైర్మన్లు దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తోంది.
సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొరను అంచనాల కమిటీ లేదా పీయూసీకి ఛైర్మన్గా నియమించనున్నట్లు తెలుస్తోంది. కొత్తపేట ఎమ్మెల్యే చిల్ల జగ్గిరెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఎమ్మెల్యే వి కళావతిని సాంఘిక,మహిళా సంక్షేమ కమిటీకి అధ్యక్షురాలిగా నియమించనున్నట్లు సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుకు కూడా చైర్మన్ పదవి ఖరారైందని సమాచారం. ప్రజా పద్దుల కమిటీ (పిఎసి) ఛైర్మన్ పదవి సంప్రదాయం ప్రకారం ప్రతిపక్ష టిడిపికి వెళ్లనుంది. అయితే ఈ కమిటీలో వైసిపి తరఫున సభ్యులుగా ఎనిమిది మందిని ఎంపిక చేసేందుకు పలువురి నేతల పేర్లను పరిశీలించినట్టు సమాచారం.
కాగా ప్రజాపద్దుల కమిటీ (పిఎసి) చైర్మన్ పదవిని టిడిపికి చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గంటా ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబుకు చెప్పినట్లు సమాచారం. గంటాతో పాటు పిఎసి చైర్మన్ పదవిని మరో ఇద్దరు ముగ్గురు సీనియర్ టిడిపి నేతలు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పిఎసి చైర్మన్ ఎంపిక విషయంపై చంద్రబాబు ఇంత వరకూ నిర్ణయం ప్రకటించలేదు.