అమరావతి: గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున నిధుల మళ్లింపు జరిగిందనీ, వీటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. శాసనమండలిలో గురువారం పిడిఎఫ్ సభ్యులు బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మణరావు, శ్రీనివాసులరెడ్డిలు జ్ఞానభేరి నిధులపై అడిగిన ప్రశ్నకు మంత్రి సురేష్ సమాధానం ఇచ్చారు.
రాజీవ్ గాంధీ కేంద్రీయ విద్యాలయం నుండి 180కోట్ల రూపాయల నిధులు పసుపు కుంకుమ పధకానికి తరలించారని మంత్రి తెలిపారు. విదేశీ పర్యటనల కోసమూ లక్షలాది రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని మంత్రి ఆరోపించారు. వీటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని సురేష్ తెలిపారు.
మంత్రి సురేష్ గత ప్రభుత్వాన్ని విమర్శిస్తుండటంపై నారా లోకేష్తో పాటు టిడిపి సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశానికి నిధులు మళ్లిస్తే అది అవినీతి ఎలా అవుతుందని లోకేష్ ప్రశ్నించారు. తప్పులు ఎత్తిచూపితే ఎదురుదాడి చేస్తున్నారని సురేష్ అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం తప్పులు చేసి ప్రజలను మోసం చేయడం వల్లనే నేడు ప్రతిపక్షంలో కూర్చుందనీ సురేష్ అన్నారు. వైఎస్ జగన్మోహనరెడ్డిపై ఉన్నవిశ్వసనీయత కారణంగా ప్రజలు 151 సీట్లు ఇచ్చారనీ సురేష్ పేర్కొన్నారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా పసుపు కుంకుమ పథకం కోసం గత ప్రభత్వం వివిధ ప్రభుత్వ శాఖల నిధులను మళ్లించిందని విమర్శించారు.