ఏపిలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఏపి ప్రభుత్వం అడిషనల్ అఫిడవిట్ను దాఖల చేసింది. ఇంతకు ముందు కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా అధికారులు, సిబ్బంది ఆ విధుల్లో ఉన్నందున ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా లేదని వెల్లడించిన ప్రభుత్వం తాజాగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభించాల్సి ఉన్నందున ఎన్నికలు నిర్వహించలేమని తేల్చి చెప్పింది.
జనవరి, ఫిబ్రవరి నెలల్లై కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పై కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసిందని ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహణకు పోలీసులతో పాటు అన్ని శాఖల సిబ్బందిని వినియోగించాల్సి ఉందని తెలిపింది. మొదటి డోసు వేసిన నాలుగు వారాల తరువాత రెండవ డోస్ వేయాలని కేంద్రం సూచించిందని అఫిడవిట్లో పేర్కొంది. ఎన్నికల ప్రక్రియ మాదిరిగానే వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహించాల్సి ఉందనీ, ప్రజారోగ్యం దృష్ట్యా వ్యాక్సినేషన్ ప్రక్రియకు ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉందని వెల్లడించింది. ఈ కారణంగా ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహించలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ అఫిడవిట్ తనకు గత రాత్రి అందిందనీ, కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని ఎస్ఈసీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో ఈ కేసు విచారణను హైకోర్టు ధర్మాసనం శుక్రవారంకు వాయిదా వేసింది.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇటీవల పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది హైకోర్టులో ఎన్నికలకు ప్రభుత్వం సిద్దంగా లేదనీ, ఎన్నికల ప్రక్రియ నిలుపుదల చేయడానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై విచారణ జరుపుతున్న హైకోర్టు ధర్మాసనం స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఏపి ప్రభుత్వం కరోనా వ్యాక్సినేషన్ విధులు అంటూ అడిషనల్ అఫిడవిట్ దాఖలు చేయడంతో ఎస్ఈసీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.