అమరావతి: రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనేది ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆలోచన అని ఏపి టూరిజం శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) అన్నారు. ఇటీవల కృష్ణానది వరదల్లో మునిగిన భవానీ ఐలాండ్ను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించారు. రాజధానిపై త్వరలో ప్రకటన చేస్తామని అవంతి తెలిపారు.
వరదల కారణంగా భవానీ ఐలాండ్లో సుమారు రెండు కోట్ల రూపాయల మేర ఆస్తినష్టం వాటిల్లిందని ఆయన చెప్పారు. రక్షణ గోడ చాలా వరకు దెబ్బతిన్నదని ఆయన అన్నారు. రెండు నెలల్లో భవానీ ఐలాండ్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామనీ, సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి పర్యాటకులను అనుమతిస్తామని అవంతి తెలిపారు.