YSRCP : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వైసీపీ ప్రభుత్వం పోరాటానికి పదును పెంచుతుంది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మంత్రులు విమర్శల దాడి పెంచుతున్నారు. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికంటే గతంలో శక్తి వంతమైన ఇందిరా గాంధీని సైతం ఎదుర్కొన్నాం. రాజకీయాల్లో ఉక్కు మహిళగా పేరొందిన ఇందిరాగాంధీని సైతం ఒప్పించి స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం. ఆమె ముందు ప్రస్తుతం ఉన్న మోదీ ప్రభుత్వం ఎంత అని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు.ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ఇందిరమ్మను సైతం ప్రజలు గద్దె దించారని.. బీజేపీకి అదే గతి పడుతుందని ఆయన హెచ్చరించారు.
YSRCP : ఏపీ ఉసురు పోసుకోకండి!
రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుండి ఏపీకి సమస్యలు తిష్ట వేశాయన్నారు. ప్రత్యేక హోదా లేదు, రైల్వేజోన్ లేదు, బడ్జెట్లో నిధులు లేవని మండిపడ్డారు. మళ్ళి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటూ కేంద్ర కొత్త నాటకం ఆడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం దక్షణాది రాష్ట్రాలను చిన్న చూపు చూస్తుందని విమర్శించారు. ఏపీ ప్రజల ఉసురు తగిలిన వాళ్ళు ఎవ్వరూ బాగు పడలేదని మంత్రి అన్నారు .జనసేనాధిపతి పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకులు తిరుపతిలో ఉప ఎన్నికల మీద కాకుండా రాష్ట్ర సమస్యల మీద దృష్టి పెట్టాలని మంత్రి హితవు పలికారు. ప్రైవేటీకరణ చేస్తామని 22 మంది ఎంపీలకు కేంద్రం ఒక్క మాట చెప్పలేదన్నారు. కొంత మంది రాజీనామాలు చేశారని.. దాని వల్ల ఫలితం ఉండదు పోరాటంతోనే ఫలితాలు ఉంటాయని ఆయన తన ప్రత్యర్థి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు పరోక్షంగా చురక వేశారు.స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటం ఈ సందర్బంగా గమనార్హం
విశాఖ స్టీల్ ని కాపాడతామన్న విజయసాయి
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ప్రజావ్యతిరేక నిర్ణయమని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ అనేక మంది ప్రాణ త్యాగాల ఫలితంగా పరిశ్రమ వచ్చిందని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం వివరంగా ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. పరిశ్రమను అభివృద్ధి చేయాలి కానీ ప్రేవేటు పరం చేయడం మంచి పద్ధతి కాదన్నారు. సొంత గనులు లేక, రుణభారం వలన సంస్థ నష్టాలలో ఉందని…సొంత గనులను కేటాయించాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రజలు ఆస్థి… దీనిని ప్రేవేటుపరం చేసే హక్కు ఎవరికి లేదన్నారు. మన వంతు అన్ని ప్రయత్నాలు చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకుందామని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.