(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ఎఫ్సిఐ నుంచి రావాల్సిన నాలుగు వేల కోట్లు బకాయిలు త్వరితగతిన విడుదల చేయాలని కేంద్ర ఆహార శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ను ఎపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కోరారు. సోమవారం ఢిల్లీలో ఆయన కేంద్ర ఆహార శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కేంద్రం 92 లక్షల కార్డులను మాత్రమే గుర్తించిందనీ, మొత్తం 1.30 కోట్ల కార్డులను గుర్తించాలనీ కేంద్రమంత్రిని కోరామని వెల్లడించారు. ఎఫ్సిఐ గోడౌన్లలో ధాన్యం నిల్వలను ఖాళీ చేయాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని నిల్వ చేయడానికి గోడౌన్ల అవసరముందని చెప్పారు సమస్యలపై కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ సానుకూలంగా స్పందించారని మంత్రి కొడాలి నాని తెలిపారు.