Chandra Babu: ఏపిలో కరోనా విజృంభణకు పరోక్షంగా చంద్రబాబు, ఆయనకు మద్దతు ఇచ్చే పత్రికలే కారణమని మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం, వైసీపీ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని కోరితే ఎన్నికలు పెట్టించి కరోనా ఉధృతికి కారణమయ్యారంటూ నాని మండిపడ్డారు. కరోనా చికిత్సకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ సమర్థవంతంగా చర్యలు తీసుకుంటుంటే చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.
కరోనా కట్టడికి ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు చేపడుతోందని అన్నారు. ఏపిలో ఒక్క రోజులో ఆరు లక్షల టీకాలు వేశామనీ, మరిన్ని వ్యాక్సిన్ లు కావాలని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కేంద్రానికి రెండు మార్లు లేఖలు రాశారన్నారు. చంద్రబాబు, ఆయనకు వత్తాసుగా ఉండే రామోజీరావు, ఏబిఎన్ రాధాకృష్ణ, టీవీ 5 నాయుడులకు ఇవేమీ కనిపించవనీ, అసత్య ప్రచారాలు చేయడమే వారి పని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి కరోనా కంటే భయంకరమైన లక్షణాలు ఉన్నాయని నాని అన్నారు.
రోజుకు పది లక్షల వ్యాక్సిన్ లు వేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న నాని..వ్యాక్సిన్ ల కోసం రూ.1,600 కోట్లను ఎక్కడికి పంపించాలో చెప్పాలని ప్రశ్నించారు. కర్నూలులో కొత్తరకం కరోనా వైరస్ బయటపడిందంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి సీబీఎన్ 420 అనే వైరస్ అనే వైరస్ నారావారిపల్లెలో పుట్టిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కర్నూలు కేంద్రంగా కరోనా కొత్త వేరియంట్ ఉందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం కరోనా కట్టడికి, వ్యాక్సినేషన్ కార్యక్రమంపై శ్రద్ధ పెట్టడం లేదంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కొడాలి నాని ఘాటుగా స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?