వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక.. ఏపీ, తెలంగాణ మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణకు చెందాల్సిన ఆస్తులు, ఇతర విషయాలపై రెండు రాష్ట్రాలు చాలా క్లియర్ గా ఉన్నాయి. కానీ.. నదీ జలాల పంపకాల విషయంలో రెండు రాష్ట్రాలు కయ్యానికి కాలు దువ్వాయి. నువ్వా.. నేనా.. అన్న రేంజ్ లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు. ఎవ్వరూ వెనక్కి తగ్గడం లేదు.
అలాగే.. అంతరాష్ట్ర బస్సు సర్వీసుల విషయంలోనూ రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి ఒప్పందాలు జరగలేదు. ఇప్పటికీ ఆర్టీసీ బస్సులపై గొడవ జరుగుతూనే ఉన్నది. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు ఎప్పుడు ప్రారంభం అవుతాయో.. చెప్పాల్సింది తెలంగాణ సీఎం కేసీఆర్ అని ఆయన స్పష్టం చేశారు. జల వివాదానికి.. బస్సు సర్వీసులకు సంబంధం ఏంటి? బస్సులు ఎప్పుడు ప్రారంభిస్తారో కేసీఆర్ నే అడగాలి.. అని ఆయన చెప్పారు.
ఆర్టీసీలో ఇప్పటికే 4700 మందికి కరోనా వచ్చింది. 73 మంది కరోనాతో చనిపోయారు. ప్రభుత్వం నుంచి సాయం అందించడంతో పాటు.. ఆర్టీసీ కార్మికులంతా తమ ఒకరోజు వేతనాన్ని పరిహారంగా ఇస్తున్నారు. అంతరాష్ట్ర సర్వీసులపై తెలంగాణ ముఖ్యమంత్రే మాట్లాడాలి. ఆయనే బస్సు సర్వీసులను ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పాలి.. అంటూ పేర్ని నాని తెలిపారు.