AP Minister Vidatala Rajini: నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రి ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడతల రజిని స్పందించారు. ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణపాయ స్థితిలో ఉన్న ఓ రోగికి సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు వైద్యం చేయడం, ఆ తర్వాత ఆ వ్యక్తి మృతి చెందడం వివాదాస్పదమైంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాధమిక వైద్యం సరిగా అందకపోవడం వల్లనే అధ్యాపకుడు రామకృష్ణ మృతి చెందాడని ఆయన బంధువులు ఆరోపించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన రామకృష్ణకు ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యురిటీ గార్డులు, స్వీపర్లు బ్యాండేజీలు కట్టారు, సెలైన్ బాటిల్ ఎక్కించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరులోని జీజీహెచ్ కు తరలించేందుకు అంబులెన్స్ లో తీసుకువెళుతుండగా మృతి చెందాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు ప్రాధమిక చికిత్స అందిస్తున్నట్లుగా ఉన్న వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడమే శాపమా..?
ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఆ వీడియోను షేర్ చేస్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడిన రామకృష్ణ ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడమే శాపం అయ్యిందనీ, డ్యూటీ డాక్టర్ ఉండి కూడా స్పీపర్, సెక్యూరిటీ గార్డులు చికిత్స చేసి ప్రాణంతో చెలగాటమాడటం దారుణమని ధ్వజమెత్తారు. ఈ ఘటనపై విమర్శలు వెత్తువెత్తుతున్న నేపథ్యంలో ఆసుపత్రి సూపర్నిటెండెంట్ వివరణ ఇచ్చారు. క్వాలిఫైడ్ సిబ్బందే వైద్య సేవలు అందించారనీ, సెక్యూరిటీ గార్డులు, స్పీపర్లు వారికి సహాయం మాత్రమే చేస్తారని చెప్పారు.
AP Minister Vidatala Rajini: వైద్యుల నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు
కాగా ఈ ఘటనపై స్పందించిన మంత్రి విడతల రజిని విచారణకు ఆదేశించారు. ఏపి వైద్య విధాన పరిషత్ (ఏపివివిపి) కమిషనర్ కు మంత్రి పలు ఆదేశాలు జారీ చేశారు. కమిటీని నియమించి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన అధ్యాపకుడు రామకృష్ణ మృతి కలిచివేసిందని, ఈ ఘటన బాధాకరమని అన్నారు. కమిటీ నివేదికలో వైద్యుల నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి ఘటనలు ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనూ పునరావృత్తం కావడానికి వీల్లేదనీ, ఎక్కడ లోపాలు తలెత్తినా కఠిన చర్యలు తప్పవని మంత్రి విడతల రజిని హెచ్చరించారు.
జగన్ రెడ్డికి ఇచ్చిన ఒక్క ఛాన్స్ తో జనం బతకడానికి ఛాన్స్ లేకుండా పోయింది. బైక్ యాక్సిడెంట్లో గాయపడిన లెక్చరర్ రామకృష్ణ నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరడమే శాపమా? డ్యూటీ డాక్టర్ వుండి కూడా స్వీపర్, సెక్యూరిటీ గార్డుతో చికిత్స చేసి ప్రాణంతో చెలగాటమాడటం దారుణం.(1/3) pic.twitter.com/1fUJ17WZzE
— Lokesh Nara (@naralokesh) May 11, 2022