తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అధికార పార్టీ నేతలే ఇసుక దందాలు నిర్వహించి భారీగా దోపిడీకి పాల్పడ్డారని నాడు జగన్మోహన్ రెడ్డితో పాటు వైకాపా నేతలు విమర్శించారు. ఉచిత ఇసుక అంటూనే పెద్ద ఎత్తున టీడీపీ నేతలు వ్యాపారం చేశారని నాడు వైకాపా నేతలు అన్న విషయం తెలిసిందే. ఈ దందా నిలువరించేందుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్య మంత్రి అయిన తరువాత నూతన ఇసుక పాలసీ తీసుకువచ్చారు. అయితే వైకాపా ప్రభుత్వ హయాంలోనూ ఇసుక అక్రమ వ్యాపారం కొనసాగుతోందన్న విమర్శలు ప్రతి పక్షాల నుండే కాక అధికపక్షంలోని కొందరు నేతల నుండి కూడా వినిపిస్తోంది. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే నిజాయితీగా వ్యవహరించే ఓ మంత్రి సైతం ఇసుక విషయంలో మోసానికి గురికావడం.
తన అధికార దర్పంతో ఉచితంగా ఇసుక తెప్పించుకొనే అవకాశం ఉన్నప్పటికీ నిబంధనల మేరకు ఆన్ లైన్ లో డబ్బులు చెల్లించి ఇసుకను బుక్ చేసుకుంటే ఆ మంత్రికి చేదు అనుభవం ఎదురైంది. మంత్రికే మోసం జరగడం ఏమిటని అవాక్కు అవుతున్నారు జనం.
విషయం ఏమిటంటే…తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మంత్రి విశ్వరూప్ నీతి నిజాయితీగా నాలుగు లారీల ఇసుక కోసం ఆన్ లైన్ లో సొమ్ము చెల్లించాడు. అయితే ఆయనకు నాలుగు లారీల ఇసుకకు బదులు మట్టితో కూడిన ఇసుకను సరఫరా చేశారు.రాజమండ్రి దగ్గర ముకల్లంక ర్యాంప్ నుంచి ఈ ఇసుక ఆయనకు సరఫరా అయింది. ఈ నాసిరకం ఇసుక చుసిన అయన అవాక్కయ్యారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమలాపురం ఆర్డీవో భవానీశంకర్ కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఈ మ్యాటర్ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ దృష్టికి కూడా వెళ్లినట్లు తెలుస్తోంది.