(అమరావతి నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి)
హైదరాబాదుకు బస్సు సర్వీసులు నడపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కేబినెట్ భేటీ అనంతరం పలువురు మంత్రులు రాష్ట్రంలోని పలు ప్రధాన సమస్యలను సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రులు ఆయన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలపై వెంటనే స్పందించి ఆదేశాలు జారీ చేశారు.
సిఎం దృష్టికి మంత్రులు తీసుకువెళ్లన సమస్యలు ఇవే..
తెలంగాణకు బస్సుల రవాణా అంశాన్ని మంత్రులు పేర్ని నాని, బొత్సా సత్యనారాయణ వివరించగా హైదరాబాద్ బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశించారు. మంత్రి పుష్ప శ్రీవాణి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల చెల్లింపు సమస్యలను వివరించగా అన్ని శాఖల పరిధిలోని విద్యాసంస్థల్లో ఉద్యోగుల జీతాలను చెల్లించాలని సిఎం సంబంధిత శాఖలను ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో అటవీ అనుమతులు, ఉపాధి హామీ పనులు చేపట్టాలని మంత్రి పుష్ప శ్రీవాణి కోరగా వెంటనే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అటవీ అనుమతులు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
శానిటైజర్ల తాగి మరణిస్తున్న అంశాన్ని మంత్రులు విశ్వరూప్, నారాయణస్వామిలు వైఎస్ జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకురాగా ప్రస్తుతం ఉన్న మద్యం ధరలపై పూర్తి స్థాయిలో సమీక్ష చేయాలని జగన్ ఆదేశించారు. శానిటైజర్లు తాగి చనిపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పలువురు మంత్రులు రోడ్ల నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయగా రోడ్ డవలప్మెంట్ కార్పోరేషన్ ద్వారా రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు జగన్.