(రాజమండ్రి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
అంతర్వేది శ్రీ లక్ష్మీనర్శింహస్వామి వారి రథం దగ్ధమైన విషయాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకున్నది. ఈ ఘటనపై పలు పార్టీలు, సంఘాల నుండి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ ఘటన ఎలా జరిగింది అనే విషయంపై పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. మరో పక్క నేడు ముగ్గురు మంత్రులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అధికారులతో దీనిపై సమీక్ష జరిపారు.
రాష్ట్ర మంత్రులు విశ్వరూప్, వెల్లంపల్లి శ్రీనివాస్, చెల్లుబోయిన వేణు, ఎస్సి కార్పోరేషన్ చైర్మన్ పెదపాటి అమ్మాజీ, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఘటన ప్రాంతాన్ని పరిశీలన జరిపి అధికారులతో సమీక్ష జరిపారు.
ఈ ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని దర్యాప్తు జరుపుతోందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. అగ్ని ప్రమాదానికి మానవతప్పిదమా, కావాలని ఎవరన్నా చేసిందా అనే విషయాలు దర్యాప్తులో వెల్లడి అవుతాయన్నారు. రూ.95లక్షలతో ఫిబ్రవరిలోగా అంతర్వేది రథం నిర్మాణం జరిగే విధంగా ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లంపల్లి పేర్కొన్నారు.
ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ప్రతి ఆలయంలోనూ సిసి కెమెరాల ఏర్పాటుకు ఆదేశాలు చేశామని చెప్పారు వెల్లంపల్లి. ఈ ఘటనను పురస్కరించుకొని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అభాండాలు వేయడం చూస్తుంటే ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావడానికి ప్రతిపక్షాలు కుట్ర చేశాయా అన్న అనుమానం కలుగుతోందని అన్నారు వెల్లంపల్లి. ఇప్పటికే రథం దగ్ధం ఘటనపై సిసి కెమెరాల విభాగం చూసే ఆలయ ఉద్యోగిని సస్పెండ్ చేశామనీ, ఇఓను బదిలీ చేశామని వెల్లంపల్లి తెలిపారు. రాజకీయ కోణంతో కొన్ని పార్టీలు కావాలనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయనీ అన్నారు.