AP Muncipal elections : ఇలా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రాగానే అలా రాజకీయాలు మొదలైపోయాయి . అందులో రాజకీయంగా చైతన్యవంతం గా ఉండే తూర్పు గోదావరి జిల్లా రాజకీయాల్లో రూటే వేరు. ఇక్కడ సామాజిక వర్గాల వారీగా గ్రూపుల వారీగా కూడా రాజకీయాలు ఉంటాయి. ఇప్పుడు ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఆ గ్రూపులో కాస్తా కుటుంబాలు బంధువుల మధ్య కూడా రాజకీయాలు చేరాయి.
దీంతో తూర్పుగోదావరి జిల్లాలోని కీలకమైన మండపేట మున్సిపాలిటీలో ఆసక్తికరమైన పోరు కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ సోమవారం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం ఎక్కడనుంచి ప్రక్రియ ఆగిందో అక్కడ నుండి ప్రారంభం కానుంది.మండపేటమున్సిపాలిటీకి సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈ ఏడాది మార్చి 3వ తేదీ మూడు గంటలకు ముగుస్తుంది.14 న పలితాలు వెలువడతాయి. ఈ నేపథ్యంలో పట్టణంలో రాజకీయ సందడి ఆరంభమైంది.
AP Muncipal elections నిత్యం మండపేటలో రాజకీయాలే
వాస్తవానికి కరోనా లో సైతం అటు వైకాపా ఇటు టిడిపి ప్రచారాన్ని ఎక్కడా ఆపలేదు. ఏదో రూపంలో ప్రజలకు టచ్ లోనే ఉంటూ వస్తున్నారు. కాగా ఈ ఏడాది జనవరి నుంచి వైకాపా, టిడిపి చైర్మన్ అభ్యర్థులు ఆయా వార్డుల్లో ప్రచారం ఉదృతం గా నిర్వహిస్తున్నారు. ఈ సారి మున్సిపల్ ఎన్నికలు గతం కంటే భిన్నంగా జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. టిడిపికి కంచుకోటగా ఉన్న మండపేట లో పాగా వేసేందుకు వైస్సార్ సిపి సర్వ శక్తులను ఒడ్డుతుంది. ఈ క్రమంలో ఏ ఒక్క అంశాన్ని వదలకుండా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వైకాపా యత్నిస్తుంది.టిడిపి తమ పట్టు నిలుపుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
దీంతో ఈ ఎన్నికలు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. మరోవైపు జనసేన కూడా రంగంలో ఉంది. అన్ని వార్డులో జనసేన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు .మండపేట మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 30 ఉండగా అయా వార్డుల్లో నువ్వా నేనా అనే పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో వైకాపా మెజారిటీ అభ్యర్థులను కౌన్సిలర్ లు గా గెలిపించి టీడీపీ కోటకు బీటలు వేయాలని వ్యూహం చేస్తోంది.
ఎంతో ఘన చరిత్ర!
1987 లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మునిసిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. తొలి మహిళా చైర్మన్ గా బిక్కిన విజయ గెలుపొందడం చరిత్ర సృష్టించింది. అప్పటినుండి జరిగిన అన్ని మున్సిపాలిటీ ఎన్నికలలో టిడిపి కైవసం చేసుకొని మండపేట పచ్చ కోట అంటూ రుజువు చేసింది.ఈ నేపథ్యంలో వైకాపా ఇన్ చార్జ్ తోట త్రిమూర్తులు తన వ్యూహాత్మక రాజకీయ ఆలోచనతో ఈ సారి వైకాపా పరం చేసేందుకు కృషి చేస్తున్నారు. 2004 లో టిడిపి నియోజకవర్గ పగ్గాలు చేపట్టిన ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అప్పటినుండి ఇప్పటివరకు నియోజకవర్గంలో మున్సిపాలిటీ,మండల, జడ్పిటిసి ఏ ఎన్నికలు వచ్చినా టిడిపిదే పైచేయిగా ఉండేలా ఎన్నికల వ్యూహం చేస్తూ వస్తున్నారు. శాసనసభఎన్నికలు, స్థానిక ఎన్నికలు ఏదైనా సరే ఆయన తనదైన శైలిలో రాజకీయ చదరంగాన్ని నడిపిస్తారు.
ఆయన వేసే ఎత్తుగడలు ప్రత్యర్థులను సైతం అయోమయానికి గురి చేసే విధంగా ఉంటాయి. పార్టీ బలపడేందుకు ఆయన వ్యూహాత్మక ముద్ర కనిపిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్ నేతృత్వంలో అభ్యర్థులను గెలిపించేందుకువ్యూహం చేస్తున్నారు.
బంధువులే అభ్యర్థులు…
మండపేట పురపాలక సంఘం చైర్మన్ పదవి ఈసారి బీసీ మహిళలకు రిజర్వ్ అయింది. దీంతో ఇరు పార్టీలు తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను బరిలో నిలిపారు. ఓం జువెలరీస్ అధినేత కొమ్ము రాంబాబు సమీప బంధువు పతివాడ నూక దుర్గా రాణి వైస్సార్ సిపి చైర్మన్ అభ్యర్థి గా పోటీలో ఉన్నారు.ఈమె గొల్లపుంత కాలనీ 20వ వార్డు పరిధిలో కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నారు. ఈమెకు సమీప బంధువైన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గడి సత్యవతి టిడిపి అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఈమె 12వ వార్డు నుంచి పోటీ పడుతున్నారు. చైర్మన్ గిరి కోసం సమీప బంధువులు నువ్వా నేనా అనే చందాన పోటీపడడం విశేషం. అందుకు తగ్గట్టుగానే ప్రచారం నిర్వహించడం ఆసక్తి గా మారింది. మరోవైపు జనసేన కూడా ఈసారి కీలకంగా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కొన్ని వార్డు గెలుచుకునే ప్రయత్నాలను ఆ పార్టీ నాయకులు చేస్తున్నారు. కొన్ని వార్డుల్లో అయితే విజయానికి కావలసిన ఓటర్లను ప్రభావితం చేయగల కెపాసిటీ కూడా ఉంది. దీంతో జనసేన ప్రభావం ఎంతమేరకు ఏ పార్టీ మీద పడుతుంది అన్న లెక్కలు అప్పుడే జోరుగా మొదలయ్యాయి. ఏది ఏమైనా తూర్పుగోదావరి రాజకీయాల్లో మండపేట కీలకంగా ఈసారి మారనుంది.