AP Municipal Elections: నెల్లూరు, కుప్పంతో పాటు 12 మున్సిపాలిటీల్లనూ వైసీపీ హవా కొనసాగుతోంది. మెజార్టీ వార్డులు వైసీపీ కైవశం చేసుకుంటోంది. నెల్లూరు కార్పోరేషన్ సహా 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు మరో పది మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న డివిజన్లు, వార్డులకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెల్లడి అవుతున్నాయి. ప్రకాశం జిల్లా దర్శి మినహా ఇతర మున్సిపాలిటీల్లో వైసీపీ తన ఆధిక్యతను కొనసాగిస్తోంది.
నెల్లూరు కార్పోరేషన్ లో 54 డివిజన్లకు గానూ 36 డివిజన్లలో వైసీపీ ముందంజలో ఉంది. కుప్పంలో తొలి రౌండ్ లో 13 వార్డులు వైసీపీ కైవశం చేసుకోగా టీడీపీ ఒక వార్డుకు పరిమితం అయ్యింది. దాచేపల్లి, అకివీడు నగర పంచాయతీలను వైసీపీ కైవశం చేసుకుంది. పెనుగొండ, కమలాపురం, రాజంపేట, జగ్గయ్యపేట, కొండపల్లిలో వైసీపీ ప్రభంజనం కొనసాగిస్తోంది.
గుంటూరు జిల్లా దాచేపల్లి మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. మొత్తం 20 వార్డులకు గానూ ఒకటి వైసీపీ ఏకగ్రీవం కాగా మిగిలిన 19 వార్డులకు జరిగిన ఎన్నికల్లో పది వార్డులు వైసీపీ, టీడీపీ ఏడు, జనసేన ఒకటి, వైసీపీ రెబల్ అభ్యర్ధి ఒక వార్డు కైవశం చేసుకున్నారు.
ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీని అనూహ్యంగా టీడీపీ కైవశం చేసుకుంది. మొత్తం 20 వార్డులకు గానూ ఒక వార్డు ఏకగ్రీవం కాగా 19 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఫలితాలు ప్రకటించిన 19 స్థానాలకు గానూ 12 స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. ఆరు వార్డుల్లో వైసీపీ అభ్యర్ధులు గెలిచారు.
వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీని వైసీపీ కైవశం చేసుకుంది. కమలాపురంలో మొత్తం 20వ వార్డులకు గాను.. వైసీపీ 15వార్డులు కైవశం చేసుకోగా టీడీపీ 5 వార్డులకు పరిమితం అయ్యింది.