AP NGOs.. ప్రభుత్వ ఉద్యోగులు అంటే.. ప్రభుత్వంలో ఒక భాగం. ఐఏఎస్ లు మాత్రమే కాదు.. క్లరికల్ ఉద్యోగులు కూడా ప్రభుత్వమే. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను.. ప్రభుత్వ విధానాలను ప్రజలకు చేరువయ్యేలా వ్యవహరించడంలో.. క్షేత్రస్థాయిలో అందేలా చేయడంలో ముఖ్య భూమిక వహించేది ఉద్యోగులే. ప్రభుత్వ ఉద్యోగిగా కొలువు సంపాదించడమే కష్టం కానీ.. ఆ తర్వాత జీవిత కాలం భరోసాని ఇస్తుందీ ఉద్యోగం. అటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు ఏపీలో ఎలా ఉన్నారు. వారికి సకాలంలో అందాల్సిన డీఏలు అందుతున్నాయా..? సీపీఎస్ పై జగన్ సీఎం కాకముందు ఇచ్చిన హామీ నెరవేరిందా..? అంటే ప్రశ్నార్ధకమే. ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల విషయంలో ఉన్న శ్రద్ధ ఉద్యోగులపై ఉందా అంటే.. అది కూడా సమాధానం లేని ప్రశ్నే అవుతుంది.
AP NGOs చంద్రబాబు అలా.. జగన్ ఇలా..
2019లో జగన్ సీఎం అయ్యే నాటికి ఏపీ 2లక్షల 41వేల కోట్ల అప్పుల్లో ఉంది. కొత్త రాష్ట్రంగా ఏపీ ఆవిర్భవించిన తర్వాత టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తన ఐదేళ్ల కాలంలో రాష్ట్రం కోసం చేసిన అప్పు ఆ సంఖ్య. సంక్షేమ పథకాల కోసమే కానీ.. రాజధాని నిర్మాణమే కావొచ్చు,, పోలవరం పనులే కావొచ్చు.. ఇలా తన పరిధిలో ఉన్నంత మేరకు అప్పులు చేసి రాష్ట్రాన్ని నెట్టుకొచ్చింది. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచి వైఎస్ జగన్ సీఎం అయ్యాక సంక్షేమ పథకాలు అమలులో జగన్ దూసుకెళ్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఈ 21 నెలల్లోనే లక్షన్నర కోట్లకు పైగానే అప్పులు చేశారు. అభివృద్ధి కార్యక్రమాల కంటే సంక్షేమ పథకాల అమలు కోసమే ఈ అప్పులు చేస్తున్నారు. మొత్తంగా ఏపీ ఇప్పుడు సుమారు 3లక్షల 90వేల కోట్ల వరకూ అప్పుల్లో ఉంది. ఇవన్నీ ప్రజల అకౌంట్లోకి వివిధ పథకాల కోసం వెళ్లేవే. కొత్తగా అప్పులు తెచ్చుకునేందుకు 2020 ఆగష్టులో ఎఫ్ఆర్ బీఎం లిమిట్ ను పెంచుతూ ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చింది. అప్పటివరకూ ఉన్న 3.5 శాతాన్ని 5 శాతం పెంచింది. అయితే..
ప్రభుత్వనికి అనుకూలంగానే ఉద్యోగులు..
ఇవన్నీ ప్రజల కోసమే. మరి వీటిని అమలు అయ్యేలా పని చేసే ఉద్యోగుల కోసం ఏమైనా చేస్తుందా అంటే భరోసా మాత్రం ఇస్తోందని చెప్పాలి. ప్రభుత్వోద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ఖజానా ఖాళీ అయిన పరిస్థితి వచ్చింది. ఈ సందర్భంలో ప్రజల సంక్షేమ పథకాలకు విస్తృతంగా ఖర్చు చేస్తున్న ప్రభుత్వం జీతాలు ఎందుకు పెంచదు.. డీఏ ఎందుకు ఇవ్వదు అని నిరసన వరకూ వెళ్లిన పరిస్థితి వచ్చింది. ఏటా రెండు సార్లు పెంచాల్సిన డీఏ పెరగలేదు. ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య వారధిలా ఉండే ఉద్యోగ సంఘాలు ఉద్యోగులను శాంతింపజేయడం తప్పితే పెద్దగా జరిగింది ఏమీ లేదు. ప్రభుత్వానికి అనుకూలంగా పని చేయడం.. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇటివలి పంచాయతీ ఎన్నికల సమయంలో కూడా తమకు సంబంధం లేని విషయంలో ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ కోర్టులకు వెళ్లి వివాదాలు కొనితెచ్చుకున్నారు. ఉద్యోగ సంఘాల్లోనే వివాదాలు సృష్టించుకున్నారు. మధ్యలో సామాన్య ఉద్యోగులు మాత్రం ఉద్యోగ సంఘాలను దాటి వెళ్లలేకపోతున్నారు.. వెళ్లలేరు కూడా.
లాభపడేది ఉద్యోగ సంఘాల నాయకులేనా..?
నిజానికి జగన్ ముందు ఉద్యోగులకు చేయాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. డీఏ బకాయు చెల్లించడం, సీపీఎస్ రద్దు చేయడం.. వంటివి ఉన్నాయి. కానీ.. ఇప్పుడు ఇవేమీ చేయలేని పరిస్థితి. సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిందే. ఉద్యోగులు పని చేయాల్సిందే.. ప్రశ్నించకుండా చూసే బాధ్యత మాత్రం సంఘాల నాయకులదే. ఉద్యోగుల కోసం కాకుండా ప్రభుత్వానికి అనుకూలంగా పని చేయడమే సంఘాల నాయకుల ముఖ్య విధి అయిపోయింది. ఇలా చేస్తే అధికార పార్టీ పదవులిస్తుంది.. అందలం ఎక్కిస్తుంది. టీడీపీ హయాంలో అశోక్ బాబు టీడీపీలో ఎమ్మెల్సీ అయిపోయారు. తెలంగాణలో శ్రీనివాస్ గౌడ్ ఇప్పుడు టీఆర్ఎస్ మంత్రివర్గంలో మంత్రి అయిపోయారు. ఇలా ఉద్యోగుల సమస్యలు అలానే ఉంటుంటే.. సంఘాల అధ్యక్షులు మాత్రం వీరికి అందనంత ఎత్తుకు ఎదిగిపోతున్నారు. ఏపీ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ వెంకట్రామిరెడ్డి, ఏపీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పరిస్థితి కూడా ఇదే. ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తున్నారు సరే..! మరి ఉద్యోగుల సంగతేంటీ.. అంటే.. మేమున్నాం కదా అంటారు. ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుందో మాత్రం చెప్పలేరు. కానీ మనం చెప్పొచ్చు.. 2024 ఎన్నికల ముందు అని..!