దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలం నుండి ఆ రెండు పత్రికలు అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల పేర్లు ప్రస్తావించకుండానే విమర్శించడం చూశాం. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం అయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. తండ్రి బాటలో తనయుడు అన్నట్లు మాదిరిగానే జగన్ ఆ పత్రికల తీరును ఎండగడుతున్న సంగతి తెలిసిందే. కాకపోతే తెలుగు దేశం పార్టీకి మద్దతుగా నిలుస్తున్నందున వాటిని ఎల్లో మీడియా అంటూ విమర్శలు ఎక్కుపెడుతూ వస్తున్నారు. ఆ పత్రికల తీరు ఆంతే ఉంది అనుకోండి. ఆ రెండు పత్రికల నైజం నేడు మరో సారి రుజువు అయ్యింది అంటున్నారు.
విషయంలోకి వస్తే… ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైన అంశం మంగళవారం వెలుగులోకి వచ్చింది. అది అన్ని మీడియాల్లో బ్రేకింగ్ న్యూస్ గా, పత్రికల్లో పతాక శీర్షికగా ఇస్తే ఆ రెండు పత్రికలు మాత్రం ఆ న్యూస్ ను లైట్ గా తీసుకున్నాయి. అది ఏమిటంటే హైదరాబాద్ పార్క్ హయత్ అనే ఫైవ్ స్టార్ హోటల్ లో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ పార్లమెంట్ సభ్యుడు సుజనా చౌదరి, ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ తో ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ వ్యవహారం.
అయితే ఈ అంశంపై ఇతర పత్రికలు, సోషల్ మీడియాలలో పుంఖాను పుంఖాలుగా కధనాలు వడ్డించాయి. టీవీల్లో డిబేట్ లు నిర్వహించారు. ఏ వార్త ప్రచురించాలి, దానికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి, ఏ వార్త ప్రచురించకూడదు అనే అంశాలు ఆయా పత్రికల సంపాదకుల లేదా యాజమాన్యాల ఇష్టం అనుకోండి. అయితే ఇంత పెద్ద చర్చనీయాంశమైన వార్తను రెండు ప్రధాన పత్రికలు మచ్చుకైనా ఇవ్వకపోవడాన్ని పాఠకులు ఆక్షేపిస్తున్నారు.
రాష్టంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సంబందించిన ప్రతి వార్త నేడు హాట్ టాపిక్ యే. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మధ్యలో ప్రభుత్వానికి కనీసం సమాచారం ఇవ్వకుండా కరోనా కారణంగా చూపి ఎన్నికలు వాయిదా వేసినప్పటి నుండి జగన్ ప్రభుత్వం ఆయనపై కత్తి కట్టిన విషయం తెలిసిందే. అనంతరం జరిగిన పరిణామాలు చూశాం.