(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
తాడేపల్లిగూడెం కోడి పందేలకూ గోదావరి జిల్లాలకూ మధ్య ఉన్న విడదీయరాని బంధం గురించి అందరికీ తెలిసిందే. సంక్రాంతి వచ్చిందంటే అక్కడ పోలీసులు ప్రతి ఏటా కోడి పందేలు జరగనిచ్చేది లేదని హుంకరించడం, చివరికి ప్రజాప్రతినిధుల జోక్యంతో సర్దుకోవడం జరుగుతోంది. మరీ గట్టి పోలీసు అధికారి ఎవరన్నా వచ్చి పందేలు వెయ్యడం కుదరదని భీష్మించినా, ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలుకొని ప్రజాప్రతినిధులు స్వయంగా బరిలో నిలవడం కూడా చూస్తూ వచ్చాం.
సంక్రాంతి మరో ఇరవై రోజులుందనగా ఈసారి అధికారపక్షానికి చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కోడి పందేలపై తన వైఖరి వెల్లడించారు. కోడి పందేలలో జూదానికీ హింసకూ తావు లేదని ఆయన అన్నారు. ఈ సంక్రాంతికి కూడా పందేలు తప్పక జరుగుతాయని రాజు పేర్కొన్నారు.
కోడి పందేలు కూడా మన సంస్కృతి సంప్రదాయాలలో ఒక భాగమేనననీ, గోదావరి జిల్లాల నుంచి కోడి పందేలను ఎవరూ విడదీయలేరనీ రఘరామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. అలాంటి ఆలోచన ఎవరన్నా చేసినా కుదరదని ఆయన అన్నారు.
తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మొదటి స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మంగళవారం వచ్చారు. రఘరామకృష్ణంరాజు ఆయనను ద్వారకా తిరుమల తీసుకువెళ్లి దగ్గరుండి దైవ దర్శనం చేయించారు. అనంతరం వారిద్దరూ తాడేపల్లిగూడెం వచ్చారు.