అమరావతి: ప్రకాశం జిల్లా వైసిపి సీనియర్ నాయకుడు ముద్దన తిరుపతి నాయుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అందజేశారు. మంత్రి బాలినేనికి సన్నిహితుడైన తిరుపతి నాయకుడు ప్రకాశం జిల్లా డిసిఎంఎస్ పదవి ఆశించాడు. అయితే ఎన్నికలకు ముందు వైసిపికి రాజీనామా చేసి టిడిపిలోకి వెళ్లి మరల ఎన్నికల అనంతరం వైసిపిలో చేరిన పర్చూరు నియోజకవర్గ నాయకుడు రావి రామనాధం బాబుకు డిసిఎంఎస్ చైర్మన్ పదవి ఇవ్వడంతో ఆ పదవిపై ఆశలు పెట్టుకున్న తిరుపతి నాయుడు అసంతృప్తికి గురై పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారికే పదవులు దక్కుతున్నాయని ఈ సందర్భంగా తిరుపతినాయుడు ఆరోపించారు. ఇక నుండి వైసిపితో తనకు ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. తన రాజకీయ భవిష్యత్తుపై అనుచరులతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. అయితే ఆయన త్వరలో బిజెపిలో చేరతారని ప్రచారం జరుగుతోంది.