అమరావతి: ఆర్టిసి చార్జీల పెంపు సామాన్యులపై భారం పడుతుందని మాజీ మంత్రి, టిడిపి నేత దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టిసి బస్సు చార్జీల పెంపు పై ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చార్జీల పెపుతో ఏటా 700 కోట్ల రూపాయల భారం ప్రజలపై పడుతోందని ఆయన అన్నారు. అయిదేళ్లలో 3500 కోట్ల రూపాయల భారం ప్రజలపై డబోతోందని ఆయన పేర్కొన్నారు. జగన్ చేతగానితనం, అసమర్దత వల్లే బస్సు చార్జీలు పెంచుతున్నారని విమర్శించారు.ఆర్టిసి చార్జీల పెంపుపై ప్రజల పక్షాన టిడిపి పోరాటం చేస్తుందని చెప్పారు. అమరావతి అంతా 144వ సెక్షన్, రాష్ట్రమంతా సెక్షన్ 30 అమల్లో ఉందనీ, ఇదేమి పరిపాలన, ఇదేమిరాజ్యమనీ ప్రశ్నించారు.
రేపట్నుంచి జరిగే శాసన సభ సమావేశాల్లో చార్జీల పెంపుపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. తెదేపా ప్రభుత్వంలో సామాన్యులపై ధరలు, చార్జీల భారం వేయలేదని ఆయన గుర్తు చేశారు.ఉల్లిపాయల కోసం రైతుబజార్ల వద్ద కిలో మీటర్ల మేర క్యూల్లో నిలబడి ప్రజలు కష్టాలు పడుతున్నారనీ, జగన్ ప్రభుత్వంలో నిత్యావసర వస్తువులన్నీ విపరీతంగా పెరిగాయనీ ఆయన పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల ధరలతో సహా బస్సు చార్జీలు వెంటనే తగ్గించాలని ఉమా డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో లిక్కర్, బెట్టింగ్, శాండ్ మాఫియా యథేచ్చగా నడుస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో లక్ష బెల్టు షాపులు నడుస్తున్నాయని ఆయన అన్నారు. వైసిపి కార్యకర్తలే బయటి నుంచి లిక్కర్ను తెచ్చి వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. ఏ జిల్లాల్లోనూ ఎస్పిలు ఆరు నెలలకు మించి పనిచేసే పరిస్థితి లేదని ఉమా అన్నారు.
మరో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ సామాన్యుడు బతకలేని విధంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. గుద్దుడే..గుద్దుడే అన్నట్లు జగన్ వ్యవహరిస్తున్నారని కొల్లు వ్యాఖ్యానించారు. ఇసుక ధరలు పెంచారు, ఇప్పుడు బస్సు చార్జీలు పెంచారు, రేపు కరెంటు చార్జీలు పెంచుతారని కొల్లు అన్నారు. రైతుబజార్లలో ఉల్లి గడ్డల కోసం తొక్కిస లాట జరిగే పరిస్థితి నెలకొందన్నారు. సామాన్యులపై భారం పడకుండా ఆర్టిసిని విలీనం చేయాలని ఆయన కోరారు. చార్జీల పెంపుపై ప్రజలతో కలసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కొల్లు హెచ్చరించారు.