AP Politics: రాష్ట్ర విభజన జరిగి దాదాపు 8 సంవత్సరాలు అవుతోంది. ఆంధ్ర, తెలంగాణ విడిపోయి రెండు రాష్ట్రాలుగా కొనసాగుతున్నాయి. ఇంకా విభజన సమస్యలు అంతే ఉన్నాయి. ఆస్తులు, అప్పుల పంపకాల వివాదం కొనసాగుతూనే ఉంది. ఏపికి రాజధాని ఏది అంటే ఠక్కున సమాధానం చెప్పే పరిస్థితి లేదు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమరావతి కేంద్రంగా రాజధానిని ప్రకటించినా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకువచ్చారు. ఈ వ్యవహారం కోర్టుకు ఎక్కడంతో మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈ తరుణంలోనే పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులో లోపాలు ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం సీఆర్డీఏ రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులను ఉపసంహరించుకుంది. అయితే మెరుగైన బిల్లు తీసుకువస్తామని సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఇటు ఆంధ్రా పరిస్థితి బాగోలేదు. అటు తెలంగాణ పరిస్థితి వారు అనుకున్నట్లుగా పురోభివృద్ధి జరగలేదు. రాష్ట్ర విభజన జరిగి ఆంధ్రావాళ్లు వెళ్లి పోతే తెలంగాణలో యువకులందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయని అనుకున్నారు. కానీ నిరుద్యోగుల ఆశలు నెరవేరలేదు.
ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. రాష్ట్ర విభజన ప్రక్రియ సరిగా జరగలేదనీ సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర రాజ్యసభలో వ్యాఖ్యానించడంతో మళ్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లను కలిపి సమైక్య రాష్ట్రంగా ఉంచాలని ఏమైనా కుట్ర చేస్తున్నారా అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఈ మాటలు ఏవరో అన్నది కాదు. తెలంగాణ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలపాలని మోడీ కుట్ర చేస్తున్నట్లుగా ఆయన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయని హరీష్ రావు పేర్కొన్నారు. మోడీకి నిజంగా ఆలోచన ఉందో లేదో తెలియదు కానీ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు మాత్రం తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. గతంలో తమిళనాడుతో విడిపోయిన ఆంధ్ర ప్రాంతాన్ని తెలంగాణలో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మార్చారు. ఆ తరువాత జై ఆంధ్రా ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలు జరిగినా సమైక్యాంధ్రగానే కొనసాగింది. మరో పక్క గ్రైటర్ రాయలసీమ ఉద్యమాలు వచ్చి సమసిపోయాయి.
చివరకు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసిఆర్ పట్టువదలని విక్రమార్కుడులా పోరాటం చేశారు. ఆమరణ దీక్ష చేసి కేంద్రం మెడలు వంచారు. రాష్ట్ర విభజనకు కారణమైయ్యారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాదించారు కేసిఆర్. అయితే ఇప్పుడు అటు కేసిఆర్, ఇటు చంద్రబాబును రాజకీయంగా దెబ్బతీయడానికి మోడీ సమైక్యాంధ్ర చేయడానికి కుట్ర చేస్తున్నారా అనేది టీఆర్ఎస్ వర్గీయుల అనుమానం. వాస్తవానికి మోడీ ఏదైనా చేయదల్చుకున్నారు అంటే ప్రజాభిప్రాయం, స్థానిక నాయకుల అభిప్రాయంతో సంబంధం లేకుండా చేసి చూపించే రకం అని అందరికీ తెలుసు. అందుకు జమ్ముకశ్మీర్ వ్యవహారమే ఒక ఉదాహరణ.