అమరావతి: టిడిపి పిచ్చివాగుళ్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మాట్లాడాల్సిన అవసరం లేదని వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నిన్న అమరావతిలో చంద్రబాబుపై దాడి జరిగిందని అసత్య ప్రచారం చేస్తున్నారు గానీ అక్కడేమీ జరలేదని అన్నారు. ఓ చెప్పు, రాయి పడ్డాయి అంతే దానికి జగన్ మాట్లాడాల్సిన అవసరం లేదని అన్నారు. పిచ్చి వాగుళ్లపై సమాధానం ఆశించకుండ చంద్రబాబును సరిచేసే విధానం ఏంటో దేవినేని ఉమామహేశ్వరరావు ఆలోచించుకోవాలని అంబటి వ్యంగ్యాస్త్రాన్నిసంధించారు. ‘కేంద్రానికి రిపోర్టు చేసుకోమనండి, ఎవరు వద్దన్నారు. మోది గారికి సాష్టాంగ నమస్కారం పెట్టి మరీ కోరమనండి’ అని అంబటి అన్నారు.
రాజధాని నిర్మాణంపై చంద్రబాబు బినామీలు తప్ప రైతులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. చంద్రబాబు రాజధాని ప్రాంతంలో హాల్చల్ చేయడానికి ప్రయత్నం చేశారన్నారు. విషయం ఉన్నా లేకపోయినా ఏదో గందరగోళం, అలజడి సృష్టించడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తూనే ఉన్నారని అంబటి విమర్శించారు. ఈ అయిదు నెలల కాలంలో చంద్రబాబు చలో ఆత్మకూరు ఆందోళన, కోడెల శివప్రసాద్ ఆత్మహత్య వ్యవహారంపై ఆందోళన, ఆ తరువాత ఇసుక దీక్షలు ఇప్పుడు అమరావతి టూర్ ఇలా డ్రామాలు ఆడటమే సరిపోతుందని అన్నారు.
అమరావతి నిర్మాణాల్లో జరిగిన భారీ అవినీతి మొత్తం విచారణలో వెలుగులోకి వస్తాయని అంబటి చెప్పారు. అమరావతి ప్రాంతంలోని రైతాంగానికి చంద్రబాబు అన్యాయం చేయడం వల్లనే ఆయన కుమారుడు లోకేష్తో పాటు రాజధాని ప్రాంతంలో టిడిపి అభ్యర్థులను ప్రజలు ఓడించారని అన్నారు. చంద్రబాబుకు రాజధానిపై అంత ప్రేమ ఉంటే ఇల్లు ఎందుకు కట్టుకోలేదని అంబటి ప్రశ్నించారు. చంద్రబాబుకు ‘ముందుంది ముసళ్ల పండగ’ అంటూ వ్యాఖ్యానించారు. గతంలో ఇచ్చిన మొత్తం స్టేలను సుప్రీం కోర్టు ఎత్తివేసిందనీ, త్వరలో చంద్రబాబు అక్రమాస్తుల కేసు విచారణ జరుగుతుందనీ అంబటి చెప్పారు.