అమరావతి: గుంటూరు జిల్లాలో రెండు చోట్ల రీపోలింగ్కు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారికి ప్రతిపాదనలు పంపామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు. శుక్రవారం ఆయన పోలింగ్ సరళిపై అమరావతిలో మీడియాతో మాట్లాడారు.
గుంటూరు పశ్చిమలోని 244 వ కేంద్రంలో, నరసారావుపేటలోని 94 వ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్కు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. గుంటూరు కలెక్టర్ సిఫారసుల మేరకు ఈ ప్రతిపాదనలు పంపామని ద్వివేది పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.
పోలింగ్ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించామని ద్వివేది అన్నారు. ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారనీ, సాంకేతిక ఇబ్బందులు తలెత్తినా ఓటర్లు సహకరించారని ద్వివేది తెలిపారు. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం కల్పించామని ద్వివేది పేర్కొన్నారు.
ప్రజలు ఎంతో ఓపికగా క్యూలో నిలబడి ఓటు వేయటం ద్వారా ఓటు హక్కు విలువను చాటి చెప్పారని ద్వివేది ప్రశంసించారు. పోలింగ్కు సహకరించిన అధికారులకు ద్వివేది కృతజ్ఞతలు తెలిపారు.