రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిలిపివేయాలని ప్రభుత్వం హైకోర్టులో వేసిన పిటిషన్పై రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) నేడు కౌంటర్ దాఖలు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రయత్నాలు ప్రారంభించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా లేదని, ఎన్నికల ప్రక్రియ నిలుపుదలకు ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా రెండు రోజుల క్రితం జనవరి 15 నుండి రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియకై కేంద్ర మార్గదర్శకాలు విడుదల చేసిందని, దీంతో అన్ని శాఖల అధికారులు వ్యాక్సినేషన్ విధులు నిర్వహించాల్సి ఉన్నందున ఎన్నికలు నిర్వహణ కష్టమంటూ అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు..ఎస్ఈసీని ఆదేశించిన నేపథ్యంలో గురువారం ఎన్నికల కమిషన్ అఫిడవిట్ దాఖలు చేసింది.
కరోనా వ్యాక్సిన్ రావడానికి కనీసం మూడు నుండి ఆరు నెలల సమయం పడుతుందని, ఇప్పటికిప్పుడు ఆ వ్యాక్సిన్ రావడం లేదని ఎస్ఈసీ కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. వ్యాక్సిన్ ను ప్రాధాన్యతా క్రమంలో పంపిణీ చేస్తున్నారనీ, వ్యాక్సిన్ పంపిణీకి స్థానిక ఎన్నికలు అడ్డుకాదని ఇసి పేర్కొన్నది. ఇప్పటికే బీహార్, రాజస్థాన్, హైదరాబాద్ లో ఎన్నికలు విజయవంతంగా నిర్వహించారని ఎస్ఈసీ గుర్తు చేసింది. ఏపిలో ఎన్నికల నిర్వహణకు సానుకూల వాతావరణం ఉందని, అందరినీ సంప్రదించిన తరువాతే ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించామని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఎన్నికలు వాయిదా వేయాలన్న ప్రభుత్వ పిటిషన్ను కొట్టివేయాలని, తగిన ఆదేశాలు ఇవ్వాలని అఫిడవిట్లో ఎస్ఈసీ అభ్యర్థించింది.