ఏపిలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో సారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సహకరించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయని లేఖలో పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలలో కూడా స్థానిక ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు జరుగుతున్న విషయాన్ని ప్రస్తావించారు.
నిమ్మగడ్డ సీఎస్తో పాటు పంచాయతీ రాజ్, గ్రామీణాబివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్కు కూడా లేఖలు రాశారు. కోర్టు ఆదేశాలను కూడా లేఖలో ప్రస్తావించారు. 2021 ఓటర్ల సవరణ ప్రక్రియ జనవరి నాటికి పూర్తి చేయాలని నిమ్మగడ్డ సూచించారు. కాగా నిమ్మగడ్డ లేఖపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.
ఇంతకు ముందు ఇదే విధంగా లేఖ రాస్తే వెంటనే సీఎస్ నీలం సాహ్ని తిరుగు లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున ఎన్నికల నిర్వహణకు పరిస్థితులు అనుకూలంగా లేవని, అధికారులు కరోనా విధుల్లో ఉన్నారని, కరోనా సెకండ్ వేవ్ అంటూ శాస్త్రవేత్తలు కూడా హెచ్చరిస్తున్నారని తదితర కారణాలు పేర్కొంటూ ప్రభుత్వం ఎన్నికలకు సిద్దంగా లేదనీ, రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు ఏర్పడిన తరువాత ఎన్నికలకు సంసిగ్దత తెలియజేస్తామని సీఎస్ పేర్కొన్నారు.
ఆ సమయంలో నిమ్మగడ్డ రాష్ట్రంలోని ఉన్నతాధికారులు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటుకు సిద్ధమైనా సీఎస్ అనుమతులు ఇవ్వకపోవడంతో క్యాన్సిల్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలుపుదల చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించినా విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది. స్థానిక సంస్థల ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించకూడదని పట్టుదలతో ఉన్న ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.