అమరావతి : దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు అధికం అవుతున్నాయి. ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్ళడానికి భయపడుతున్నారు. ఏపీ సచివాలయంలో మరో మారు కరోనా కలకలం రేపింది. ఇటీవల ఏపీ సచివాలయం, అసెంబ్లీ ఉద్యోగులకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించగా..నేడు రిపోర్ట్ లు వెలువడ్డాయి. తాజాగా పది మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించారు. దీనితో ఇప్పటి వరకు సచివాలయం, అసెంబ్లీలలో కలిపి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 30 కి చేరింది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
కరోనా నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుండి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుండి విధులను నిర్వహిస్తున్నారు. వివిధ శాఖాధిపతులు కూడా సచివాలయానికి సక్రమంగా రావడం లేదని సమాచారం. కొందరు కార్యాలయానికి వచ్చినా గంట రెండు గంటలు ఉండి వెళ్ళిపోతున్నారట.
మరో పక్క కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన ఉద్యోగులతో సన్నిహితంగా మెలిగిన ఉద్యోగులను ఇంటి నుండే వర్క్ చేయాలని అధికారులు సూచించారుట.
కాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ విడుదల చేసిన తాజా కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 19,148 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజా కేసులతో కలిపి దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 6,04,641 కు చేరుకోగా 3 లక్షల 59 వేల మంది వైద్య సేవల అనంతరం కోలుకొని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ 19 మృతుల సంఖ్య 17,834 కు చేరుకున్నది. ఏపీలో 812 కరోనా కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణలో కరోనా కేసులు వెయ్యి దాాటాయి. మొత్తం 1,018 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు.