ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న కరోనా కలకలం విషయంలో ఏపీ ఓ ప్రత్యేకతను సృష్టించింది. కోవిడ్ నివారణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు తీసుకుంది. దాని ఫలితంగా ప్రత్యేక రికార్డు సాధించింది.
రాష్ట్రంలో కోవిడ్ పరీక్షల సంఖ్య 1,00,00,000 (కోటి) దాటింది. ఆదివారం ఉదయం 9 గం. సమయానికి 1,00,17,126 పరీక్షలు పూర్తయ్యాయి.
వేగంగా ఏర్పాట్లు ….
ఏపీ ప్రభుత్వం వైరస్ వ్యాప్తి నివారణకు అత్యంత వేగంగా పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. పక్కాగా కార్యాచరణను అమలు చేసింది. నాడు వైరస్ను నిర్ధారించే స్థితిలో లేని రాష్ట్రంలో ఇప్పుడు 150 ల్యాబ్లలో కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు. కరోనా వైరస్ను గుర్తించిన నాటి నుంచి అప్రమత్తంగా వ్యవహరిస్తూ, వైద్య పరీక్షలతో పాటు, క్వారంటైన్, ఐసొలేషన్, ఆస్పత్రుల్లో చికిత్స, ఆ తర్వాత రోగులు కోలుకున్న తర్వాత వారిని సురక్షితంగా ఇళ్లకు చేర్చడం వరకు ప్రతి అంశంలో ప్రత్యేకత నిలుపుకున్న రాష్ట్ర ప్రభుత్వం, ఆ ప్రక్రియలో మరో కీలక అడుగు ముందుకు వేసింది.
టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్
ఏపీ ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో క్రియాశీలంగా వ్యవహరించింది. వీలైనన్ని చోట్ల కరోనా వైద్య పరీక్షలు నిర్వహించడం, పాజిటివ్ కేసులు గుర్తిస్తే వెంటనే వారికి క్వారంటైన్ లేదా ఐసొలేషన్ చేయడం, అవసరమైతే ఆస్పత్రుల్లో చికిత్స చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం చురుకుగా వ్యవహరిస్తోంది. చికిత్స అనంతరం వారిని ప్రభుత్వమే సురక్షితంగా ఇళ్లకు చేరుస్తోంది. అందుకే తక్కువ వ్యవధిలోనే కోటి వైద్య పరీక్షల మైలురాయిని దాటి ఒక రికార్డు సృష్టించింది.
ఎక్కడెక్కడ ఈ పరీక్షలు?
రాష్ట్రంలో తొలుత కరోనా పరీక్షలకు అనువైన ల్యాబ్స్ లేకపోవడం వల్ల, ఫిబ్రవరి 1న తొలి శాంపిల్ను తెలంగాణలోని గాంధీ ఆస్పత్రికి పంపించారు. ఆ తర్వాత రాష్ట్రంలో తొలి కరోనా పరీక్ష మార్చి 7న తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్)లో నిర్వహించారు. తొలి దశలో కేవలం స్విమ్స్లో మాత్రమే కరోనా వైద్య పరీక్షలు నిర్వహించే సదుపాయం ఉండగా, ఆ తర్వాత వేగంగా పలు చోట్ల ఆ సదుపాయం ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మొత్తం 150 ల్యాబ్లలో కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 15 చోట్ల కరోనా వైద్య పరీక్షల కోసం సదుపాయాలు కల్పించారు. శ్రీకాకుళం రిమ్స్, విశాఖపట్నం ఏఎంసీ, కాకినాడ ఆర్ఎంసీ, విజయవాడ ఎస్ఎంసీ, గుంటూరు జీఎంసీ, ఒంగోలు రిమ్స్, నెల్లూరు ఏసీఎస్ఆర్ జీఎంసీ, తిరుపతి స్విమ్స్, తిరుపతి ఎస్వీఆర్ఆర్జీహెచ్, కడప రిమ్స్, కర్నూలు కేఎంసీ, అనంతపురం జీఎంసీ, ఏలూరు అస్రమ్, విజయనగరం మిమ్స్, మంగళగిరి ఎయిమ్స్లో కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు, 4 ప్రైవేటు ల్యాబ్లలో (కర్నూలు, తిరుపతి, విజయవాడ, తాడేపల్లి) కూడా కరోనా వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఇంకా 90 ట్రూనాట్ ల్యాబ్స్, 6 సీబీనాట్, 5 నాకో, 5 సీఎల్ఐఏ ల్యాబ్లతో పాటు, ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్వర్యంలో 44 వీఆర్డీఎల్ ల్యాబ్లు పని చేస్తున్నాయి. వాటన్నింటిలో కలిపి రోజుకు 70–75 వేల వైద్య పరీక్షలు చేసే స్థాయికి రాష్ట్రం చేరుకుంది. శాంపిళ్ల సేకరణకు 122 బస్సులలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది.
ఎన్ని రోజుల్లో ఎన్ని పరీక్షలు?:
రాష్ట్రంలో తొలి లక్ష పరీక్షల నిర్వహణకు 59 రోజుల సమయం పట్టింది. ఆ తర్వాత జూలై 5వ తేదీ ఉదయం నాటికి పరీక్షల సంఖ్య 10 లక్షలు దాటగా, ఆదివారం (నవంబరు 29వ తేదీ) ఉదయం 9 గంటల సమయానికి ఆ సంఖ్య కోటి మైలు రాయి దాటి రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు 1,00,17,126 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా వారిలో 8,67,683 కేసులు పాజిటివ్గా తేలాయి. 91,49,443 కేసులు నెగిటివ్గా నమోదయ్యాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?