కొద్దికాలం క్రితం వరకు సంచలన కామెంట్లతో వార్తల్లో నిలిచిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ తాజాగా మళ్లీ అదే తరహా కీలక వ్యాఖ్యలు చేశారు.
గతంలో అమరావతి, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు, తెలుగుదేశం పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన కోర్టులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కోర్టుల తీర్పులు భరించలేక… జనం ఏదో ఒక రోజు ఉద్యమిస్తే తెలుస్తుందన్నారు.
జగన్ మౌనం… తమ్మినేని సంచలనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కళ్ళు,చెవులు లేని ప్రతిపక్షం ఉందని తమ్మినేని సీతారం మండిపడ్డారు. పేదలకు సంక్షేమం అందకపోతే ప్రతిపక్షం పోరాడాలి అంతేకాని కోర్టులకు పోయి స్టేలు తెచ్చుకోవడం సరైన పద్దతి కాదని అన్నారు. 30 లక్షల మందికి ఇళ్ల పట్టలు ఇవ్వకుండా అడ్డుకుంటే… పేదలు ఊరుకుంటారా అని తమ్మినేని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో అభివృద్ధి, సంక్షేమాన్ని అడ్డుకుంటే మూల్యం చెల్లిస్తారని తమ్మినేని సీతారాం అన్నారు. సీఎం జగన్ ఎందుకో మౌనం వహిస్తున్నారని… మౌనం బద్ధలైతే ప్రళయం వస్తుందన్నారు. అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు.
బాబును లోపల వేసేయడం ఖాయమే
అమరావతిలో టీడీపీ నేతలు అందిన కాడికి దోచుకున్నారని తమ్మినేని సీతారం ఆరోపించారు. అమరావతి విషయంలో సీబీఐ విచారణ వద్దంటున్నారని వాళ్లంతా దొరలమన్నట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 26 కేసుల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్టే తెచ్చుకున్నాడన్న చంద్రబాబుకు దమ్ముంటే స్టేలు వెకేట్ చేయించుకోమనండని సవాల్ చేసారు. చంద్రబాబును ఏక్షణంలో మూసేస్తారో తెలియదన్న ఆయన లేనిపోని వెధవ పనులు చేసి సిబిఐ విచారణ వద్దంటున్నారని అన్నారు. గతంలో పేదలు ఇళ్ల కోసం అధికారుల చుట్టూ తిరిగి విసిగి దండం పెట్టేసేవారని అన్నారు.
గతంలోనూ రఘురామ కృష్ణంరాజుపై…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నరసాపురం లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు వ్యవహారంపై కూడా స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు.ఏపీ ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగానే నరసాపురం ఎంపీ విమర్శలు చేస్తున్నారన్న ఆయన.. పార్టీ నచ్చకపోతే రాజీనామా చేసి వెళ్లిపోవచ్చు అని వ్యాఖ్యానించారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ కోరారు.
అమరావతి విషయంలోనూ….
ఏపీ రాజధాని అమరావతిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో స్పీకర్ తమ్మినేని సీతారాం విస్మయం కలిగించేలా వ్యాఖ్యానించారు. ఏపీ రాజధానికి వెళ్లడం అంటే రాజస్థాన్ ఎడారిలోకి వెళుతున్న ఫీలింగ్ కలుగుతుందని ఆయన అన్నారు. ఈ విషయాన్ని మిగిలిన వాళ్లు బహిరంగంగా చెప్పలేకపోయారని, తాను చెప్పగలిగానని తెలిపారు. రాజధాని నాది అని రాష్ట్ర ప్రజలంతా భావించాలి, అమరావతిలో నాకు ఇది కనిపించలేదని తమ్మినేని అభిప్రాయపడ్డారు. మూడు రాజధానుల ప్రతిపాదనను రాష్ట్ర ప్రజలంతా స్వాగతిస్తున్నారని తెలిపారు. దీనిపై విమర్శలు చేసేవారు ముందుగా వాస్తవాలను తెలుసుకోవాలని హితవు పలికారు. ఇన్సైడర్ ట్రేడింగ్పై కచ్చితంగా చర్యలు తీసుకోవాలన్న ఆయన పార్టీ ఫిరాయింపులపై త్వరగా చర్యలు తీసుకునేలా చట్టం మారాలని అన్నారు. అసెంబ్లీలో వాడుతున్న బాష పై అందరూ బాధ్యత తీసుకోవాలన్న ఆయన ఈ సంప్రదాయాలకు ఎక్కడో ఒకచోట అడ్డుకట్ట వేయాలని అన్నారు. వ్యక్తిగత, రాజ్యాంగ విలువలను కాపాడుకోవాలన్న తమ్మినేని ఏదోఒక సమయంలో భావోద్వేగాలకు లోనుకావడం సహజమని అన్నారు.