ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆంధ్రప్రదేశ్ మరోసారి సత్తా చాటింది. ఈరోజు ప్రకటించిన జాబితాలో 2019 సంవత్సరానికి గాను ఏపీ నెం 1 స్థానంలో ఉండగా తెలంగాణ మూడవ స్థానానికి పరిమితమైంది. గతేడాది విడుదల చేసిన జాబితాలో ఏపీ, తెలంగాణ వరసగా 1,2 స్థానాల్లో నిలిచాయి. ఈసారి ఆంధ్రప్రదేశ్ తర్వాత ఉత్తర్ ప్రదేశ్ రెండవ స్థానంలో నిలిచింది.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రాష్ట్రాల ర్యాంకింగ్స్ను ప్రపంచ బ్యాంక్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ కలిసి రూపొందిస్తాయి. 12 కీలక సంస్కరణలతోపాటు 405 అంశాల ఆధారంగా ఈ జాబితాను రూపొందిస్తారు. వ్యాపారం ప్రారంభించడానికి నిబంధనలు, అనుమతులకు పట్టే సమయం, వ్యాపార ప్రారంభానికి అయ్యే ఖర్చును కూడా పరిగణలోకి తీసుకుని ఈ జాబితాను రూపొందిస్తారు. ఆత్మనిర్భర్ భారత్ కోసం రాష్ట్రాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను ముందుకు తీసుకెళుతున్నాయని కేంద్రం చెప్పుకొచ్చింది.