అమరావతి: సిఎం జగన్ కనుసన్నల మేరకే స్పీకర్ సభ నడిపిస్తున్నారు తప్ప సభ్యుల హక్కులను కాపాడటం లేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. సభ నిర్వహణ తీరుపై టిడిపి తమ నిరసనను గురువారం కూడా కొనసాగించింది. టిడిపి అధినేత చంద్రబాబు, నారా లోకేష్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కాలినడకన ర్యాలీగా ప్లకార్డులు పట్టుకొని అసెంబ్లీకి చేరుకొని తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. సభలో టిడిపి సభ్యుల సస్పెన్షన్, విపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపై నిరసన తెలియజేస్తూ కాలినడకన అసెంబ్లీకి చేరుకున్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ శాసనసభలో ప్రజాస్వామ్య విధానాలు మచ్చుకు కూడా కనిపించడం లేదని ధ్వజమెత్తారు. బిఎసి సమావేశంలో చెప్పింది ఒకటి, అసెంబ్లీలో జరుగుతున్నది మరొకటని చంద్రబాబు అన్నారు. సభలో ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. తనను తిట్టిపోయడానికే అధికార పార్టీ సభ్యులకు మైక్ ఇస్తున్నారని చంద్రబాబు వాపోయారు. ప్రభుత్వ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగతామని చంద్రబాబు పేర్కొన్నారు.