(ఆమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర బస్సు సర్వీసు పునరుద్ధరణ మరింత ఆలస్యం అయ్యేటట్లు కనబడుతోంది. ఇరు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నడిపే విషయంపై బుధవారం హైదరాబాద్ బస్సు భవన్లో టీ ఎస్ ఆర్టీసీ, ఏపిఎస్ ఆర్టీసి ఉన్నతాధికారులు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలోనూ రెండు రాష్ట్రాల మధ్య ఎన్ని కిలో మీటర్లు, ఎన్ని బస్సు సర్వీసులు నడపాలనే దానిపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఇప్పటికే మూడు పర్యాయాలు అధికారులు సమావేశమయ్యారు. ఇప్పుడు నాల్గవ సారి భేటీలోనూ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ఈడీల సమావేశం ముగిసింది.
కరోనా నేపథ్యంలో ఏడు నెలలుగా ఇరు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నిలిచిపోయిన సంగతి విదితమే. లాక్ డౌన్ ఆంక్షల సడలింపు నేపథ్యంలో రెండు నెలల క్రితం అంతరాష్ట్ర ప్రజా రవాణాకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఆర్ టీ సీ బస్సు సర్వీసులను పునరుద్ధరించలేదు. తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కు రోజుకు లక్షా 60వేల కిలో మీటర్ల మేర బస్సులు నడుపుతామనీ ఏ పి ఎస్ ఆర్ టి సి కూడా అన్ని కిలో మీటర్లకే పరిమితం కావాలని తెలంగాణ అధికారులు సూచిస్తున్నారు. ఈ ప్రతిపాదనకు ఏపి అధికారులు అంగీకరించడం లేదు. రెండు రాష్ట్రాలు చెరో 1.61లక్షల కిలో మీటర్లు బస్సులు నడిపాలనే ప్రతిపాదన రాగా దానిపై మరో సారి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.
తెలంగాణను బస్సు సర్వీసులు ప్రారంభించే విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఇటీవల ఏపి రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. త్వరలో దసరా పండుగ వస్తున్న నేపథ్యంలో బస్సు సర్వీసులు ఎప్పుడు ప్రారంభం అవుతాయా లేదా ఆందోళనలో ప్రజలు ఉన్నారు. ఇదే అదనుగా ప్రైవేటు ఆపరేటర్లు టికెట్ ధరలను పెంచి ప్రయాణీకులను దోపిడీ చేస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?