అమరావతి : కరోనా లాక్ డౌన్ ఆంక్షల సడలింపు నేపథ్యంలో రాష్ట్రా ప్రజలకు ఏపీ పోలీసులు శుభవార్త చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు ప్రయాణించాలంటే పాస్లు అవసరం లేదని పేర్కొన్నారు. అంతర్ జిల్లాల్లో పాస్లు లేకుండా రాకపోకలు సాగించవచ్చని పోలీస్ శాఖ ప్రకటించింది.
ఏపీలోని ప్రజలు చాలా మంది ట్విట్టర్ వేదికగా తాము పొరుగు జిల్లాలకు వెళ్లేందుకు అనుమతులు కావాలంటూ పోలీసులను అభ్యర్థించారు. ఈ ట్వీట్లకు స్పందించిన పోలీసులు.. పొరుగు జిల్లాలకు వెళ్లాలంటే పాస్లు అవసరం లేదని స్పష్టం చేశారు. పాస్లు అవసరం లేనప్పటికీ నిబంధనలు మాత్రం పాటించాలని స్పష్టం చేశారు. మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలనీ, కారుల్లో ముగ్గురు మించకుండా ప్రయాణించవచ్చని తెలిపారు. అవి కూడా చిన్నా చితక పనులకు కాకుండా..ఏదైనా అత్యవసరమైన పనులు ఉంటేనే వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. నిభందనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరిస్తున్నారు. రెడ్, ఆరెంజ్ జోన్స్, కంటైన్మెంట్ ఏరియాల్లో మాత్రం నిబంధనలు యథావిధిగా కొనసాగుతాయని చెబుతున్నారు. నాల్గొవ విడత లాక్ డౌన్ కొనసాగుతున్నందున ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు మాత్రమే అనుమతులు ఉంటాయని చెబుతున్నారు. ఆ సమయం తర్వాత ఎవరైనా బయటకు వస్తే చర్యలు తప్పవు.
కాగా ఇతర రాష్ట్రాలకు వెళ్లాలన్నా, పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీకి రావాలన్నా అనుమతులు తప్పనిసరి. అత్యాసర పనుల నిమిత్తం ఇతర రాష్ట్రాలకు వెళ్ళే వారికి మాత్రమే పోలీసులు పాస్లు జారీ చేయనున్నారు. ఎమర్జెన్సీ మెడికల్ ట్రీట్మెంట్, కుటుంబంలో మరణం, ప్రభుత్వ విధి నిర్వహణ, సామాజిక పనులు, తదితర పనులపై ప్రయాణించాలనుకునే వారికి ఈ-పాస్లు జారీ చేయనున్నట్టు పోలీస్ శాఖ తెలిపింది. ఈ-పాస్ల కోసం https:citizen.appolice.gov.in అనే వెబ్సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది