AP TS Water War: తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీ జరుగుతున్న వేళ ఏపి అధికారులకు తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు. నాగార్జునసాగర్ లో తెలంగాణ జెన్కో నుండి జల విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని కోరుతూ వినతి పత్రం సమర్పించేందుకు ఏపి అధికారులు వెళ్లగా తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. ఏపి, తెలంగాణ మధ్య జల జగడం నడుస్తున్న వేళ ప్రాజెక్టుల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జల విద్యుత్ కేంద్రాల వద్ద భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. గురువారం నాడు మాచర్ల నుండి డీఎస్పీ, ఆర్డీఓ, ఎన్ఎస్పీ ఎస్ఈలు సాగర్ కు వెళ్లగా నూతన వంతెన వద్ద తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు.
విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వద్దకు వెళ్లేందుకు అనుమతించాలని ఏపి అధికారులు కోరినా తెలంగాణ పోలీసులు నిరాకరించారు. దీంతో ఏపి అధికారులు జెన్ కో సీఈఓకు ఫోన్ చేసి తమ వినతిపత్రం స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఆయన అందుకు సమ్మతించలేదు. వినతి పత్రాన్ని డీఐజీకి ఇవ్వాలని సమాధానం చెప్పడంతో ఏపి అధికారులు వెనుతిరిగారు. తొలుత రైట్ బాండ్ గెస్ట్ హౌస్ లో నల్లగొండ జిల్లా ఎస్పి రంగనాధ్, గుంటూరు జిల్లా ఎస్పీ విశాల్ గున్ని సమావేశమైయ్యారు. అనంతరం గుంటూరు ఎస్ప రంగనాధ్ సాగర్ జలాశయం నూతన వంతెన వద్ద ఏర్పాటు చేసిన భద్రతను పర్యవేక్షించారు.
ఇటు పులిచింతల వద్ద కూడా పోలీస్ బందోబస్తు పెంచారు. ప్రాజెక్టులో నీరు సగం నిండకండానే తెలంగాణ సర్కార్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించడం సరికాదని ప్రాజెక్టు అధికారులు తెలంగాణ జెన్ కో కు లేఖ రాశారు. అయినా విద్యుత్ ఉత్పత్తి ఆపకపోవడంతో నేరుగా అధికారులు చర్చలు జరపాలని భావిస్తున్నారు. దీంతో ప్రాజెక్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఎర్పడకుండా గుంటూరు జిల్లా సత్తెనపల్లి డీఎస్పీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నారు. పులిచింతల జల విద్యుత్ కేంద్రం వద్ద సూర్యపేట జిల్లా పరిధిలో తెలంగాణ పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.