APTF: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై మంత్రుల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన చర్చలు ఫలప్రదం అయిన సంగతి తెలిసిందే. ఉద్యోగుల డిమాండ్ లలోని పలు అంశాల్లో సవరణలకు ప్రభుత్వం అంగీకరించడంతో సమ్మె విరమిస్తున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల నేతల చర్చల నేపథ్యంలో ఒప్పందాలపై 20 మంది స్టీరింగ్ కమిటీ సభ్యులు సంతకాలు చేశారు.
సమ్మె విరమణ ప్రకటన తరువాత అర్ధరాత్రి ఏపిటీఎఫ్ (ఉపాధ్యాయ సంఘం) బిగ్ ట్విస్ట్ ఇస్తూ పత్రికా ప్రకటన విడుదల చేసింది. పిఆర్సీ ఫిట్ మెంట్ పై పునరాలోచన లేదని మంత్రుల చెప్పడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సభ్యులు సీహెచ్ జోసఫ్ సుధీర్ బాబు, జి హృదయరాజు, కేఎస్ఎన్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు వారు పత్రికా ప్రకటన విడుదల చేశారు.
APTF: ఫిట్ మెంట్ 30 శాతం ఇవ్వాల్సిందే
మంత్రుల కమిటీ చర్చల్లో కొన్నింటిపై సానుకూలంగా స్పందన ఉన్నప్పటికీ ఇచ్చిన ఐఆర్ కంటే ఫిట్ మెంట్ తక్కువ ఇవ్వడంపై స్పందన సరిగా లేదన్నారు. ఈ అంశంపై మంత్రులతో మాట్లాడితే దాన్ని వారు నిరాకరించారనీ, సీఎం వదద్ కూడా ప్రస్తావించకూడదని స్పష్టం చేశారనీ, ఇది అప్రజాస్వామిక చర్య అని పేర్కొన్నారు. నూతన పిఆర్సీలో అనేక అంశాలు తిరోగమనం చెందాయన్నారు. మంత్రుల కమిటీలో ఫిట్ మెంట్ ను సవరించకపోవడం, రిటైర్ అయిన వారికి గ్రాట్యుటీ, కమ్యుటేషన్ ఇవ్వకపోవడం, సీపీఎస్ రద్దు పై స్పష్టత లేకపోవడం, ఇతర వేతన జీవులకు సంబంధించి స్పష్టత లేకపోవడం బాధిస్తోందన్నారు. ఈ అంశంపై సీఎం జోక్యం చేసుకుని ఫిట్ మెంట్ 30, గ్రాట్యూటీ 2018 జులై 1 నుండి ఇవ్వాలని కోరారు.
APTF: ఉపాధ్యాయుల కార్యాచరణ
మంత్రుల కమిటీ వద్ద చర్చల్లో కొన్ని అంశాలపై పురోగతి ఉన్నా ఫిట్ మెంట్, రిటైర్ అయిన వారికి అందే ఆర్ధిక ప్రయోజనాలు, సీపీఎస్ రద్దు పట్ల స్పష్టత లేదని ఏపిటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కులశేఖర్ రెడ్డి అన్నారు. ఈ అంశాలను ప్రస్తావించే ఏపీటీఎఫ్ అధ్యక్షుడు హృదయరాజు సమావేశం నుండి బయటకు వచ్చేశారని తెలిపారు. ఆదివారం ఎగ్జిక్యూటివ్ కమిటీలో చర్చించి తదుపరి ఉపాధ్యాయుల కార్యాచరణ ప్రకటిస్తామని కులశేఖర రెడ్డి తెలిపారు.
APTF: వారి వెనుక ఎవో రాజకీయ శక్తులు
ఏపీటీఎఫ్ నేతల ప్రకటనపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ స్పందించారు. అన్ని అంశాలు అంగీకరించి బయటకు వెళ్లిన తరువాత వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదని అన్నారు. ఫిట్ మెంట్ ఇంకా పెంచాలని అడిగినప్పటికీ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి వివరించి వారందరినీ ఒప్పించామన్నారు. ఆ సమయంలో స్టీరింగ్ కమిటీ సభ్యులుగా ఉన్న ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కూడా అంగీకారం తెలిపారన్నారు. అంతా అయిపోయాక సంతకాలు పెట్టి బయటకు వెళ్లి కొందరు ఉపాధ్యాయ సంఘాల నేతలు చర్చలకు వ్యతిరేకంగా మాట్లాడటం మంచి సంప్రదాయం కాదని సజ్జల అన్నారు. వారు బయటకు వెళ్లి వ్యతిరేకంగా మాట్లాడటాన్ని బట్టి చూస్తే ఎవో రాజకీయ శక్తులు వారిని నడిపిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని సంచలన కామెంట్స్ చేశారు సజ్జల.
Read more:YS Jagan: దటీజ్ జగన్ అనిపించుకున్నారుగా..? టీ కప్పులో తుఫానులా ఉద్యోగుల ఆందోళన..!!