బ్యాంకుల ముందు చెత్తవేసిన వ్యవహారంలో ఉయ్యూరు మున్సిపల్ కమీషనర్ ప్రకాశరావుని ప్రభుత్వం సస్పెండ్ చేయడాన్ని తెలుగుదేశం పార్టీ తప్పుపట్టడమే కాకుండా అందులో కొత్త పాయింట్ ఒకటి లేవదీసింది.
ఉయ్యూరు తోపాటు నూజివీడు, మచిలీపట్నం, విజయవాడలలో కూడా బ్యాంకుల ముందు చెత్త వేయడం జరిగిందని,అయితే దళితుడు కాబట్టే ప్రకాశరావును ప్రభుత్వం బలిపశువును చేసిందని టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు.మిగిలిన మున్సిపల్ కమిషనర్లు ముగ్గుర్ని ఎందుకు ప్రభుత్వం సస్పెండ్ చేయలేదని ఆయన నిలదీశారు.ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్ చేసింది తప్పని ప్రభుత్వం నిర్ధారించి ఆయనను సస్పెండ్ చేసినప్పుడు ఆ మిగిలిన ముగ్గురు మున్సిపల్ కమిషనర్లు కూడా అదే పని చేసినా ఎందుకు వదిలేశారని రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు.
దళితులంటే జగన్ ప్రభుత్వానికి చిన్నచూపు అని మరోసారి రుజువైందని ఆయన చెప్పారు.గతంలో ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కారణంగా శ్రీ లక్ష్మి లాంటి ఐఏఎస్ అధికారులే జైలుపాలయ్యారని ఇప్పుడు జగన్ అలాగే అధికారులను వివాదాల్లో ఇరికిస్తున్నారని ఆయన విమర్శించారు.నిజానికి మున్సిపల్ కమీషనర్లు తమంతట తాముగా బ్యాంకుల ముందు చెత్త వేయలేదని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే ఆ పని చేశారని,అయితే విషయం ప్రధాని దాకా చేరి అక్కడ నుంచి హెచ్చరిక రావడంతో ముఖ్యమంత్రి జగన్ వణికిపోయి ఎక్కడ బెయిలు రద్దయి జైలుకు వెళ్లాల్సివస్తుందోనని భయపడి ఈ విషయంలో తాము చర్యలు తీసుకున్నామని చూపటానికి దళితుడైన ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్ ని సస్పెండ్ చేశారన్నారు.
అసలు ఈ వ్యవహారంలో ప్రధాన దోషులు ముఖమంత్రి ,మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ లన్నారు.ముఖ్యమంత్రి జగన్ ఈ సంఘటనకు సంబంధించి క్షమాపణ చెప్పాలని బొత్స సత్యనారాయణకు మంత్రి పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.మున్సిపల్ కమీషనర్ ప్రకాశరావు సస్పెన్షన్కు వ్యతిరేకంగా పోరాడుతామని ఆయనకు న్యాయం జరిగే వరకు తాము అండగా ఉంటామని రాజేంద్రప్రసాద్ చెప్పారు.