కేరళ రాష్ట్రంలోని ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప స్వామి వారి ఆలయంలో ఈ నెల 16వ తేదీ నుండి అయిదు రోజుల పాటు పూజా కార్యక్రమాలకు భక్తులకు అనుమతి ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా వ్యాధి నేపథ్యంలో కేరళ ప్రభుత్వం శబరిమల యాత్రకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇతర రాష్ట్రాల నుండి భక్తులు స్వామివారి పూజ కార్యక్రమాలకు రానున్న నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తూ మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. ఈ మార్గదర్శకాలను ఆయా రాష్ట్రాల్లో స్థానిక భాషలో ప్రచురిస్తూ అందరికీ తెలియజేయాలని కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విశ్వాస్ మెహతా కోరారు.
- ఇవీ నూతన మార్గదర్శకాలు..
ఇతర రాష్ట్రాల నుండి వచ్చే భక్తులు ముందుగానే కేరళ పోలీస్ శాఖ అభివృద్ధి చేసిన వర్చువల్ క్యూ పోర్టల్ లో తమ పేర్లు నమోదు చేసుకోవాలి. దీని కోసం https://sabarimalaonline.org వెబ్ సైట్ లింక్ ను ఏర్పాటు చేశారు. - వారం ప్రారంభంలో రోజుకు వెయ్యి మంది, వారాంతరాల్లో రోజుకు 2వేల మంది చొప్పున పోర్టల్ లో రిజిస్టర్ చేసుుకనే వీలు కల్పించారు.
దర్శనానికి 48 గంటల ముందు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. నెగిటివ్ రిపోర్టు వచ్చిన వారినే అనుమతి ఇస్తారు. - పది సంవత్సరల లోపు వారిని, 60 సంవత్సరాల పై బడిన వారిని దర్శనానికి అనుమతించరు. దీర్ఘకాల, గుండె సమస్యలతో బాధపడుతున్న వారు కూడా శబరిమల యాత్రకు రాకూడదు.
- శబరిమల యాత్రకు వచ్చిన వాళ్ళు తమతో పాటు ఆయుష్మాన్ భారత్, బీపీఎల్ తదితర ఆరోగ్య భీమా కార్డులను వెంట తెచ్చుకోవాలి.
- స్వామికి నెయ్యాభిషేకాలు, పంపా నదిలో స్నానాలు, సన్నిధానంలో రాత్రి బస చేయడం వంటివి అనుమతించరు.
- కేవలం ఏరుమేలి, వడ సెర్రికర మార్గాల్లో మాత్రమే భక్తులను అనుమతిస్తారు. మిగతా అన్ని మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు.